
తమిళనాడు సిఎంగా విజయ్ నేడు ప్రమాణ స్వీకారం చేశారు. వెంటనే ఎన్నికలలో ఇచ్చిన మూడు హామీలను అమలు చేస్తూ మూడు ఫైల్స్పై సంతకాలు చేశారు. 1. ప్రతీ ఇంటికీ 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా. 2. మహిళల రక్షణ కొరకు ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు. 3. మాదక ద్రవ్యాలను అరికట్టేందుకు యాంటీ డ్రగ్స్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు.
విజయ్ రాజకీయాలకు కొత్త కనుక ఊక దంపుడు ప్రసంగం చేయకుండా మనసు విప్పి మాట్లాడారు. దాంతో విజయ్ ప్రసంగిస్తున్నంత సేపు ప్రజలు, అభిమానుల చప్పట్లు, ఈలలతో నెహ్రూ ఇండోర్ స్టేడియం మారుమ్రోగింది.
“ఈ ప్రభుత్వం మన అందరిదీ. అంటే ప్రజా ప్రభుత్వం. ఇది మన అందరి కోసం పనిచేస్తుంది. ఆకలి బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. కనుక మీ సమస్యలు తీర్చేందుకు ఓ మీ కుటుంబ సభ్యుడిగా చిత్తశుద్ధితో పని చేస్తాను. ముఖ్యంగా విద్యార్ధుల కోసం విజయ్ మామ చాలా మంచి పనులు చేస్తాడు,” అని విజయ్ చెపుతున్నప్పుడు ఆడిటోరియం చప్పట్లతో దద్దరిల్లిపోయింది.
అయితే తొలి ప్రసంగంలో గత (డీఎంకే) ప్రభుత్వంపై ఖజానా ఖాళీ చేసి వెళ్ళిపోయిందంటూ తొలి విమర్శ కూడా చేశారు. రాష్ట్ర, ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితి ఏవిధంగా ఉందో తెలుసుకోకుండా ప్రమాణ స్వీకార వేదిక నుంచే ‘ఖజానా ఖాళీ’ అనడం, అందుకు డీఎంకేని తప్పు పట్టడం తొందరపాటు లేదా రాజకీయ అపరిపక్వతే.
కానీ “ఆచరణ సాధ్యమైనవే చెపుతాం.. చెప్పిన ప్రతీ పని చేస్తాం,” అని చెప్పడం పరిణతిగా ఉన్నాయి. తన ప్రభుత్వం వాస్తవిక దృక్పదంతోనే ముందుకు సాగుతుందని చెప్పడం మంచిదే. కానీ ఈ మాటకు కట్టుబడి ఉండటమే చాలా కష్టం.
“మా ప్రభుత్వంలో ఒకటే పవర్ సెంటర్ అది నేను మాత్రమే..” అని విజయ్ చెప్పడం దేనికంటే, తాను ముఖ్యమంత్రి కావడానికి, ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మద్దతు ఇచ్చిన పార్టీలు…వాటి ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యం చేయాలనుకుంటే కుదరదని విజయ్ ఖరాఖండీగా చెప్పారు.
బొటాబొటి మెజార్టీతో ప్రభుత్వం నడుపుతున్న వ్యక్తికి ఈ ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు చాలా అవసరమే. కానీ ఈ లక్షణాల వలన మద్దతు ఇస్తున్న పార్టీల ఇగో దెబ్బ తినకుండా చూసుకోవడం కూడా అంతే అవసరం.
Ram Charan's Peddi, directed by Buchi Babu Sana, has already emerged as one of the…
In an industry where success often decides everything, some filmmakers continue getting opportunities because of…