
అందరూ ఊహించిన మాదిరే తెలంగాణలో విజయశాంతి కమలానికి నీళ్లొదిలి కాంగ్రెస్ కి చేయందించింది. ఎన్నికల చివరి నిమిషంలో పార్టీ కండువాలు మార్చిన నేతలు కాళీగా ఉంటారా? అన్నట్టు ఇక విజయ శాంతి డ్యూటీ ఎక్కింది.ఏ పార్టీకి రాజీనామా చేసి వచ్చోయిందో ఇక ఆ పార్టీ పై తమ విమర్శల అస్త్రాలను ఎక్కుపెట్టింది తెలంగాణ రాములమ్మ.
తెలంగాణ బీజేపీ పార్టీలో కేసీఆర్ నాటిన మొక్క వలన బీజేపీ పార్టీకి తెగ పట్టింది. ఆ కారణంగానే ఎన్నికలకు నాలుగు నెలలముందు బీజేపీ అధిష్టానం చేతుల మీదుగా రాష్ట్ర అధ్యక్ష్యుడి మార్పు జరిగింది. ఆ మార్పుతోనే రాష్ట్రంలో బీజేపీ పాతాళానికి పడిపోయింది. ఎవరి పాలన నుండి తెలంగాణ రాష్ట్రానికి విముక్తి దొరకాలని ఇన్ని సంవత్సరాల నుండి పోరాటం చేస్తున్నామో ఇప్పుడు ఆ కుటుంబానికి, ఆ కుటుంబ పార్టీకి బీజేపీ అనధికార మద్దతు ఇవ్వడం జీర్ణించుకోలేకనే బీజేపీ నుండి బయటకు రావాల్సి వచ్చింది అంటూ బీజేపీ, బిఆర్ఎస్ పార్టీకి బి. టీం అంటూ కాంగ్రెస్ చేసే ప్రచారానికి తనవంతు బలం చేకూర్చే పనిలో ఉన్నారు లేడీ బాస్.
పరిస్థితి చూస్తుంటే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి రాగానే విజయ శాంతికి కాంగ్రెస్ పెద్దలు కట్టబెట్టిన పదవులతో కూడిన ఆతిధ్యం ఫలించినట్టుంది.”ఒక్క దెబ్బకు రెండు పిట్టలు” అనే సామెత లెక్క ఒక్క వ్యక్తి భుజంపై నుండి రెండు పార్టీల మీద విమర్శలు అనే ఆయుధాన్ని ఎక్కిపెట్టడానికి కాంగ్రెస్ పార్టీ సిద్దమయినట్టుంది. రాజీనామా చేసిన పార్టీతో పాటు తానూ రాజీనామా చేయడానికి దారితీసిన పరిస్థితులను వివరించడంతో విజయ శాంతికి అటు బీజేపీతో పాటు ఇటు బిఆర్ఎస్ పై కూడా విమర్శలు చేయడానికి అవకాశం చిక్కినట్టయింది.
కేసీఆర్ కు వ్యతిరేకంగా పోరాడడానికి రాములమ్మ ఎన్ని పార్టీల జెండాలైనా మోయడానికి, ఎన్ని పార్టీల కండువాలైన మార్చడానికి సిద్ధంగా ఉన్నారనేది నేటి విజయశాంతి వ్యాఖ్యలతో స్పష్టమయింది.అందుకే రాములమ్మతో రాజకీయ మాములుగా ఉండదంటారు. అయితే ఏ పార్టీలో ఉన్న ఈమెగారి పాత్ర ఎన్నికల హడావుడిలోనే కనపడుతుంది. ఈసారి ఎన్నికలలో అయినా ‘విజయ’శాంతికి ఆమె పేరులో ఉన్న విజయం దక్కుతుందేమో చూడాలి!
Prabhas and Salman Khan happened to be two of the biggest superstars in Indian cinema.…
There is no shortage of twists and unexpected returns in Andhra Pradesh and Telangana politics.…