
ఇదే దారిలో ప్రస్తుతం తీసివేసిన మంత్రుల అనుచరులు, కార్యకర్తలు నిలువగా, రెండో సారైనా మంత్రి పదవి వస్తుందని ఆశించిన వారు నిరసనలకు దిగారు. ఈ నిరసనలు ఎక్కడి వరకు వెళ్లాయంటే, కృష్ణాజిల్లా వైసీపీ నేత సామినేని ఉదయభాను అనుచరులు పెట్రోల్ తో బైక్ కు నిప్పటించే క్రమంలో వారికి కూడా అంటించుకున్నారు.
కాబోయే మంత్రుల పేర్లు వరకు ఖరారయ్యాయి, ఇక ఎవరికి ఏ మంత్రి పదవి వరిస్తుందో అన్న ఆశలో అందరూ తలమునకలై ఉన్నారు. రోజా అయితే ఏకంగా హోమ్ మంత్రి అయిపోయిందని వికీపీడియాలో కొందరు అప్ డేట్ కూడా చేసేయడం కలకలం రేపుతోంది. మధ్యాహ్న సమయానికి ఈ మంత్రుల కేటాయింపులు జరగనున్నట్లుగా తెలుస్తోంది.
ఇందులో అసంతృప్తి చెందే వారు లేకపోరు. ఎందుకంటే హోమ్ ఆశించిన వారికి ఏదో నామమాత్రపు మంత్రి పదవి ఇస్తే, వారి నిరసనలు జగన్ కు తగలేకపోవు. అయితే ఒక్కసారి కేటాయించాక, మార్పులు చేయడం అనేది జగన్ నుండి ఆశించే అంశం కాదు గానీ, పార్టీలో నేతలందరూ “నివురు గప్పిన నిప్పు”లా ఉంటున్నారనేది ఈ సందర్భంగా వెలుగు చూస్తున్న అంశం.
ఇప్పటివరకు “వైసీపీ అంటే జగన్ – జగన్ అంటే వైసీపీ” మాదిరి కనిపించింది. కానీ చాలామంది నేతలు తమ అధినేతకు నిరసనలు తెలియజేయడానికి అవకాశం కోసం ఎదురు చూస్తున్నారన్న విషయం ఈ మంత్రి పదవుల విషయంలో స్పష్టమవుతోంది. ఏకంగా ఎమ్మెల్యే పదవికే సుచరిత రాజీనామా ఇచ్చారంటే అసంతృప్తి ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు.
మీడియా వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం అయితే, బాలినేని ఏకంగా రాజకీయాల నుండి దూరం అయ్యే ప్రకటన వస్తుందని కధనాలు ప్రసారం చేస్తున్నారు. నాడు కాంగ్రెస్ నుండి బయటకు వచ్చిన నాటి నుండి వైఎస్ జగన్ కు అండదండలుగా ఉంటున్న బాలినేని కుటుంబానికి సరైన న్యాయం జరగలేదనే వాదన సర్వత్రా వ్యక్తమవుతోంది.
ఒక్క విషయంలో మాత్రం జగన్ ను మెచ్చుకోవాలి. 2014లో ఎవరికైతే మంత్రి పదవులు ఇస్తున్నారో వారంతా, కేవలం రెండున్నర్రేళ్ళు మాత్రమే ఉంటారని, ఆ తర్వాత కొత్తవారికి మంత్రి పదవులు ఇస్తానని చెప్పారు. అంటే ముందుగా మంత్రి పదవులు అనుభవించిన వారు మరో ఆరు మాసాలు అధికంగానే సంబంధిత హోదాలో ఉన్నారు. వారి అసమ్మతిలో అర్ధం లేదు.
ఇదే సమయంలో తదుపరి విస్తరణలో మంత్రి పదవులు ఇస్తానని జగన్ హామీలు ఇచ్చారు. కానీ వాటిని మాత్రం నిలబెట్టుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారు. లోకేష్ ను ఓడిస్తే ఆర్కేకు మంత్రి పదవి అంటూ అప్పుడు ఓపెన్ గానే బంపర్ ఆఫర్ ప్రకటించారు. కానీ ఇప్పటివరకు ఆర్కేను రాజధాని విషయంలో బలిపశువును చేయడం మినహా పెద్దగా కట్టబెట్టింది ఏమీ లేదు.
ఇలా జూనియర్, సీనియర్ అన్న తారతమ్యం లేకుండా జరిగిన మంత్రి పదవుల ఎంపిక పార్టీలో కలకలం రేపుతుండగా, రేపు రెండేళ్ల తర్వాత జరగనున్న సార్వత్రిక ఎన్నికల సీట్ల కేటాయింపులో ఇంకెంత రచ్చ ఉంటుందో బహుశా జగన్ అంచనా వేయకపోవచ్చు. ఎందుకంటే ప్రతి నియోజక వర్గంలో ప్రస్తుతం ఉన్న నేతకు ప్రత్యామ్నాయంగా మరో నేతను జగన్ అందుబాటులో ఉంచుతున్నారు.
ఇదే అసమ్మతికి కారణమవుతోంది. బహుశా ఉన్న నేతల మీద విశ్వాసం లేకపోవడమో లేక వారిని గమనించడానికి క్రింది స్థాయిలో మరికొందరిని ప్రోత్సహించడమో గానీ, వైసీపీ రాజకీయ విధానాలు మాత్రం తలలు పండిన వారికే అర్ధం కాని రీతిలో సాగుతున్నాయి. ప్రస్తుత తీరుతో అయితే ఒక్కటి మాత్రం స్పష్టం… “పార్టీలో జగన్ కు ఎదురుతిరిగేవారు లేరు” అనుకున్న మాటలు అవాస్తవం అని తేలుతోంది.
Andhra Pradesh has just hit a major milestone, securing 2nd place in the National Panchayat…
Following the pan-India success of Kalki 2898 AD, Prabhas is now preparing for the much-awaited…