
ఒకప్పుడు అన్నపూర్ణగా పేరుపొందిన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు అరుణప్రదేశ్ గా తన పేరు మార్చుకుని తన దీన అవస్థను తెలియ చేయడానికి సినిమాల రూపంలో వెండితెర మీదకు అడుగుపెట్టింది. అయితే ఇది ఏపీ సాధించిన విజయంగా అభివర్ణించాలో…,లేక ఇలా రూపాన్ని మార్చుకుని తన దిన స్థాయిని ప్రజల ముందు చెప్పుకోవడానికి ముందుకొచ్చినందుకు సిగ్గుపడాలో అర్థంకాని అయోమయ పరిస్థితిలో ఉన్నారు ఏపీ ప్రజలు.
విభజన వలన ఏపీ నష్ట పోయింది, నాశనమైపోయింది అంటూ రాజకీయ పార్టీలు గగ్గోలుపెట్టాయి. అదేవిధంగా విభజన చేసిన పార్టీని రాష్ట్ర ప్రజలు కూడా ఏపీలో సమాధి చేసేసారు. అయితే ఇప్పుడు ఏపీ ఉన్న పరిస్థితిని ఒక్కసారి విశ్లేషణ చేస్తే., విభజనతో జరిగిన గాయం కంటే కూడా పెద్దగాయాన్ని చేసారు నమ్మి ఓటేసి అధికారాన్ని కట్టబెట్టిన పార్టీలు.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని చీల్చింది అంటూ ఆ పార్టీని నిట్టనిలువునా చీల్చి తన రాజకీయానికి పునాదిరాళ్ళు వేసుకున్నారు జగన్. రాష్ట్రాన్ని చీల్చిన కాంగ్రెస్ వద్దు, రాజధాని కట్టని టీడీపీ వద్దు ఏపీ లో రాజన్న రాజ్యం రావాలి అంటూ ప్రజలను మెప్పించో,మాయచేసో అధికారాన్ని అందిపుచ్చుకున్న వైసీపీ అధికారం అందిన వెంటనే తన ముసుగు తీసి ఏపీ ప్రజలకు ఊహించని షాక్ ఇచ్చిందనే చెప్పాలి.
మీరు ప్రభుత్వాన్ని మార్చారు నేను రాజధానితో పాటు మీ భవిష్యత్తు ను మారుస్తున్నానంటూ ఏపీకి ఒకటికాదు మూడు రాజధానులు అంటూ మరో రెండు ప్రాంతాల ప్రజలను తన రాజకీయ క్రీడలోకి తీసుకువచ్చారు జగన్. అయితే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఏపీ ప్రజలతో ఈమూడు ముక్కలాట ఆడుతూ వస్తున్న జగన్ చివరికి ఒకరాజధానికి పరిమితం అవుదాం అని చూసినా అందుకు న్యాయస్థానాలు అడ్డుచెప్పడంతో ఎటు తేల్చుకోలేక ఈసారి ప్రజలను ఎలా మాయ చేయాలో అంటూ ఆలోచనలో పడ్డారు.
ఈ నేపథ్యంలో భాగంగా రాజధానుల లిస్టులో మరోప్రాంతాన్ని జత చేసారు వైసీపీ నాయకులు. ఎన్నికలకు సమయం సమీపించడంతో ఒక్కొక్కరు ఒక్కో రాజధానిని ప్రకటిస్తూ ఏపీ ప్రజల సహనాన్ని పరీక్షిస్తున్నారు. తాజాగా వైవి సుబ్బారెడ్డి ఏపీలో ఉన్న ఆర్థిక పరిస్థితుల దృశ్యా ఏపీకి కొత్తగా రాజధానిని నిర్మించేంత స్తోమత లేదు కాబట్టి మరో కొన్నేళ్లు ఏపీకి హైద్రాబాద్ నే ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలి అంటూ ఏపీకి నాలుగో రాజధానిని ప్రకటించారు.
వైవి సుబ్బారెడ్డి వ్యాఖ్యలు ఇలా ఉంటే., ఏపీ సినిమా రివ్యూలా మంత్రి గా పేరు సంపాదించుకున్న అంబటి ఏపీకి అమరావతే రాజధాని అంటూ వైవి సుబ్బారెడ్డి చేసిన డామేజ్ ని కవర్ చేసే ప్రయత్నం చేసారు. ఇక వైసీపీ మరో నాయకుడు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ అసలు ఏపీకి రాజధాని అవసరం ఏముంది.? రాజధాని ఏమైనా అన్నం పెడుతుందా ఏంటి..? అంటూ మరో వాదనను తెరమీదకు తెచ్చారు. అంటే ఈయనగారి దృష్టిలో ఏపీకి రాజధాని అవసరం లేదన్నమాట.
రాష్ట్రానికి రాజధాని అవసరం లేదన్నప్పుడు ఒక ప్రభుత్వాన్ని నడపడానికి ఇంతమంది సలహాదారులు, ఇంతమంది మంత్రులు, ఇంతమంది ఉన్నతాధికారులు అవసరమా..? ఇక వైసీపీ మరో ముఖ్య నాయకుడు మంత్రి బొత్స ఏపీకి మూడు కాదు నాలుగు కాదు ఒకే రాజధాని అది విశాఖే అంటూ మరోప్రకటన చేసారు. ఇలా ముఖ్యమంత్రి జగన్ మూడంటారు, ఒక మంత్రి అమరావతి అని, మరో మంత్రి విశాఖ అని, మరో నేత అసలు రాజధాని లేదని, ఇంకొకరు హైద్రాబాద్ అంటూ ఇలా తమను నమ్మి ఓటేసిన పాపానికి ఏపీ ప్రజలకి ఎప్పటికి మరిచిపోలేని రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు.
“మాటతప్పం, మడం తిప్పం” అంటూ ప్రచార ఆర్భాటాలు చేసుకునే వైకాపా నాయకులు ఇలా ఒక పార్టీలోనే, ఒక ప్రభుత్వం నుండి రాజధాని నిర్ణయం పట్ల ఇన్ని విభిన్న వాదనలు వినిపించడాన్ని ఏమనాలి..? అన్న “మాట ఇచ్చాడంటే చెయ్యడంతే అనాలా”..? రాజధాని ఎక్కడ నిర్మించాలో కూడా తమ ఐదేళ్ల పదవి కాలంలో తేల్చుకోలేని నాయకులకు మరో ఛాన్స్ అవసరం ఏముందో మధుసూదన రెడ్డి చెపితే బాగుంటుంది అంటున్నారు ఏపీ ప్రజానీకం.
Tollywood’s troubles show no signs of ending as another Friday has turned disastrous at the…
Akshay Kumar’s Bhooth Bangla has managed to perform decently at the box office and avoided…