
ఏపీకి ప్రత్యేక హోదా లభించకపోతే రాష్ట్రానికి పరిశ్రమలు రావని, యువతకు ఉద్యోగాలు దొరక్క అన్యాయం అయిపోతారంటూ ఆనాడు ఆందోళనలు, దీక్షలు చేసిన జగన్, ముఖ్యమంత్రి అయ్యాక ఆ ఊసే ఎత్తడం లేదు. కానీ మళ్ళీ ప్రత్యేక ప్రత్యేక హోదా గురించి అన్నకు మాట్లాడక తప్పని పరిస్థితి కల్పించారు వైఎస్ షర్మిల.
అందుకే మళ్ళీ చాలా ఏళ్ళ తర్వాత నిన్న శాసనసభ బడ్జెట్ సమావేశాలలో జగన్ ఈ విషయం ప్రస్తావిస్తూ, “ఆనాడు రాష్ట్ర విభజన చేస్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదాని చట్టంలో చేర్చి ఉంటే నేడు మనం కోర్టుకు వెళ్ళి పోరాడైనా సాధించుకునే వాళ్ళం. కానీ చేర్చకపోవడంతో ఎండమావిగా మారిపోయింది.
కేంద్రంలో అధికారంలో ఉండే పార్టీకి పూర్తి మెజారిటీ లేకపోతే మన మద్దతు కోరి ఉండేవారు. అప్పుడు పట్టుబట్టి ప్రత్యేక హోదా సాధించుకుని ఉండేవాళ్లం,” అని జగన్ అన్నారు.
మరి ఈ ముక్క ఆనాడు ప్రత్యేక హోదా కోసం దీక్షలు, ధర్నాలు చేస్తునప్పుడే జగన్ ఎందుకు చెప్పలేదు?ఇప్పుడే ఎందుకు?అంటే వైఎస్ షర్మిల ప్రత్యేక ప్రత్యేక హోదా అంశంతో ఇటు వైసీపిని, అటు రాష్ట్ర రాజకీయాలను కూడా హైజాక్ చేయాలని ప్రయత్నిస్తున్నందునే! ఆమె ఏపీకి ప్రత్యేక హోదా అంశం లేవనెత్తకపోయి ఉంటే జగన్ కూడా దాని గురించి మాట్లాడేవారా?
ఆనాడు 25 మంది ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలు వంచి ఏపీకి ప్రత్యేక హోదా సాధిస్తానని చెప్పుకుని 23 సీట్లు సంపాదించుకున్నారు. కానీ వాటితో ఏపీకి ప్రత్యేక హోదా సాధించకపోగా, కేంద్రానికి అవసరమైనప్పుడల్లా వారితో మద్దతు ఇస్తూనే ఉన్నారు. తమ కేసులు, అప్పుల కోసమే విధేయంగా మెసులుకుంటూ ఏపీకి ప్రత్యేక హోదాని విస్మరించారని అందరికీ తెలుసు.
ఏపీకి ప్రత్యేక హోదాని చట్టంలో చేర్చి ఉంటే దాని కోసం న్యాయపోరాటాలు చేసి సాధించేవాడినని, లేదా కేంద్రంలో అధికార పార్టీకి పూర్తి మెజార్టీ లేకపోయినా ఒత్తిడి చేసి సాధించేవాడినని జగన్ నమ్మబలుకుతున్నారు.
కేంద్రంతో సంబంధమే లేని వ్యవహారం అమరావతి రాజధాని! దానినే ఓ పెద్ద కేసుగా మార్చేసి దాంతో 5 ఏళ్ళు కాలక్షేపం చేసేసిన జగన్, ఏపీకి ప్రత్యేక హోదా కోసం న్యాయం పోరాటాలు చేస్తారంటే నమ్మశఖ్యంగా ఉందా? .
కేంద్రంలో అధికార పార్టీకి పూర్తి మెజార్టీ లేకపోతే ఏపీకి ప్రత్యేక హోదా అని జగన్ చెప్పడం కూడా ప్రజల కళ్ళకు గంతలు కట్టే ప్రయత్నమే. ఒకవేళ కేంద్రంలో అధికార పార్టీకి నిజంగా ఏపీ ఎంపీల మద్దతు అవసరంపడితే, దాంతో తమ ఎంపీలకు కేంద్ర మంత్రి పదవులు సాధించుకునే ప్రయత్నం చేస్తారు. తమ కేసులు మాఫీ చేయించుకుని, కాంట్రాక్టులు సంపాదించుకునేందుకు ప్రయత్నిస్తారు తప్ప ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని పట్టుబడతారంటే నమ్మగలమా?
కేంద్రంలో పూర్తి మెజారిటీతో ఉన్నా లేకపోయినా ఏ ప్రభుత్వమూ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదు. ఇస్తే మాకూ ఇవ్వాలంటూ తెలంగాణ, బిహార్, తదితర రాష్ట్రాలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తూనే ఉన్నాయి.
ఈ విషయం ఏపీ ప్రజలందరికీ కూడా తెలుసు. కానీ ‘ప్రత్యేక హోదా’ సెంటిమెంటుని వారిని ఆకట్టుకుని ఆనాడు జగన్ లాభపడాలని ప్రయత్నించారు. ఇప్పుడు ఆయన చెల్లెలు వైఎస్ షర్మిల లాభపడాలని ప్రయత్నిస్తున్నారే తప్ప ఎవరికీ దానిని సాధించాలనే చిత్తశుద్ధి లేదని ప్రజలు గ్రహించడం చాలా ముఖ్యం.
Tollywood’s troubles show no signs of ending as another Friday has turned disastrous at the…
Akshay Kumar’s Bhooth Bangla has managed to perform decently at the box office and avoided…