ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు జగన్ సమావేశం నిర్వహించగా, దానికి 10 మంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడం వైసీపీ వర్గాలలో కలకలం రేపింది. వీరంతా తమ వ్యక్తిగత కారణాలతోనే సమావేశానికి రాలేకపోతున్నామని బయటకు చెబుతున్నా, వర్తమాన రాజకీయాలను పరిశీలిస్తే… పార్టీని వీడేందుకు నిర్ణయించుకున్న కారణంగానే వీరంతా రాలేదన్న అనుమానాలకు బలం చేకూరుతోంది.
ఈ జాబితాలో కొందరు తెలుగుదేశం పార్టీలో చేరనున్నారన్న ఉద్దేశంలో ఉన్నట్టు మీడియా కథనాలు కూడా ప్రచారంలో ఉన్నాయి. వీరు రాకపోవడాన్ని జగన్ సైతం సీరియస్ గా తీసుకున్నట్టు సమాచారం. ప్రజల్లోకి ఇతర నేతల్లోకి తప్పుడు సంకేతాలు పంపేలా వ్యవహరించ వద్దని జగన్ కోరినట్లు అన్నట్టు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ 10 మంది ఎమ్మెల్యేలు హాజరు కానప్పటికీ, తనకు అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలతోనే జగన్ సమావేశమయ్యారు.
రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, ఎమ్మెల్యేల ఫిరాయింపుల తరువాత ఏర్పడ్డ నష్టం, ఆయా నియోజక వర్గాల్లో రెండో స్థానంలో ఉన్న నేతల వివరాల గురించి జగన్ అడిగి తెలుసుకున్నట్టు సమాచారం. కాగా, మరో 30 మంది వరకూ వైకాపా నుంచి తమ పార్టీలోకి జంప్ చేయనున్నారని పలువురు టీడీపీ నేతలు మీడియా ముందు వెల్లడించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ పది మంది ఆ జాబితాలోని వారేనా? కాదా? అన్న విషయం ఆసక్తికరంగా మారింది.



