ఏపీలో రాజకీయ కలకలం ఇప్పట్లో ఆగేలా కనపడడం లేదు. నలుగురు ఎమ్మెల్యేల జంపింగ్ తోనే ఉక్కిరిబిక్కిరి అవుతున్న వైసీపీ వర్గాలకు మరో షాక్ అతి త్వరలో తగలనుందని, దాదాపుగా డజను మంది ‘పసుపు’ జెండా కప్పుకోవడానికి సిద్ధమయ్యారనే మీడియా ప్రసారాలు పార్టీ అధినేత జగన్ కు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. వైసీపీ నేతగానే కాదు, ఒక కుటుంబ సభ్యుడిగా మారిన భూమా నాగిరెడ్డే పార్టీని వీడంగా లేనిది మిగతా వారు ‘క్యూ’ కట్టడంలో విశేషం లేదని స్వయంగా ఒక వైసీపీ ఎమ్మెల్యే వ్యాఖ్యానించడంతో జగన్ కు భారీ ‘జలక్’ ఖాయమన్న విషయం ఖరారైంది.
ఓ ప్రముఖ మీడియా ఛానల్ చేసిన ఫోన్ ఇన్ కార్యక్రమాల్లో భాగంగా వ్యాఖ్యానించిన సదరు వైసీపీ ఎమ్మెల్యే… పార్టీ మారే వారి సంఖ్య 12 నుండి 13 వరకు ఉండవచ్చని సమర్ధించడంతో మానసికంగా వైసీపీ అభిమానులు, కార్యకర్తలు తీవ్ర నిరాశలో పడ్డారు. పార్టీ ఫిరాయింపుదారులపై, అధికార పార్టీపై ఓ వైపు జగన్ ఎన్ని విమర్శలు చేస్తున్నా, వాటికి ప్రాధాన్యత ఇవ్వకుండా వైసీపీ ఎమ్మెల్యేలు వారి పనుల్లో వారు ఉన్నారని అర్ధమవుతోంది. అంటే పార్టీ నేతలపై జగన్ కు ఏ మేరకు పట్టు ఉందో అద్దం పడుతోందని అంటున్నారు విశ్లేషకులు.



