ఇప్పటివరకు కాస్త వేచిచూసే వైఖరి వహించిన ఆంధ్రప్రదేశ్ సర్కార్ తొలిసారిగా కేంద్ర ప్రభుత్వంపై నిరసన గళం విప్పింది. ‘పొమ్మనక పొగపెడుతున్నట్లు’ వ్యవహరిస్తున్న బిజెపి విధానాలపై స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నోరు మెదపడం పలు ఊహాగానాలకు తెరలేపుతోంది. ఇప్పటికిప్పుడు టిడిపి – బిజెపిల మిత్ర బంధానికి నష్టమేమీ వాటిల్లక పోయినప్పటికీ, భవిష్యత్తులో కొనసాగే అవకాశం లేదన్నది స్పష్టమైంది. ఎందుకంటే, ఆంధ్రప్రదేశ్ లో బలపడడానికి ఇంత కంటే మంచి అవకాశం రాదని బిజెపి అధిష్టానం భావిస్తోందట.
ఏపీలో కాంగ్రెస్ పార్టీకి నూకలు చెల్లిపోయాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఖచ్చితంగా మరో పదేళ్ళ పాటు కాంగ్రెస్ ప్రస్తావన ఏపీలో రాకపోవచ్చు. ఆ తర్వాత కూడా గ్యారెంటీ లేదు. ఇక, ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైసీపీ ఎన్నాళ్ళు ఉంటుందన్నది ప్రశ్నార్ధకమే. ఓ పక్కన వలసలు వెల్లువెత్తుతుండగా, మరో పక్కన జగన్ కేసుల చిట్టా పార్టీని ఎక్కడ నిలబెడుతుందో..? అన్న జవాబులు లేని ప్రశ్నలు ఎన్నో ఎన్నెన్నో..! ఇక, ఉన్న ‘ఎర్ర జెండా’ పార్టీల సంగతి సరేసరి! దీంతో ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని, ఏపీలో తన ప్రభావాన్ని చాటుకోవాలని బిజెపి తాపత్రయపడుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
అయితే వాస్తవ రూపానికి వస్తే… ఏపీలో బిజెపికి ఓటు బ్యాంకింగ్ లేదు. గత ఎన్నికల్లో బిజెపి సాధించిన విజయాలు పవన్ కళ్యాణ్, టిడిపి ఖాతాలోకే వెళ్తాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా బిజెపికి 3 శాతంకు మించి రావన్నది తాజా సర్వే చెప్పిన విషయం. ఈ సంఖ్యను పెంచుకునే క్రమంలో స్వార్ధపూరిత రాజకీయానికి ఏపీని బలి చేస్తున్నారన్న కధనాలకు ప్రజల నుండి స్పందన వస్తోంది. ప్రజల్లో తెలుగుదేశం పాలనకు వ్యతిరేకత వచ్చేలా ఉండేందుకే రాష్ట్ర అభివృద్ధికి మోడీ సర్కార్ కృషి చేయడం లేదన్న వ్యాఖ్యలు సర్వత్రా వినపడుతున్నాయి.
అయితే రాష్ట్ర అభివృద్ధికి సహకరించని బిజెపికి అప్పుడు ప్రజలు ఓటు వేస్తారా? లేదా అన్నది పక్కన పెడితే, ఏపీలో అధికార పార్టీకి ప్రతిపక్షంగా బిజెపి సిద్ధమవుతుందన్న సంకేతాలు స్పష్టంగా వెలువడుతున్నాయి. దీనికి మెగా ఫ్యామిలీ నుండి పవన్, చిరంజీవి వంటి వారి సహకారం కూడా లభించవచ్చని ఒక టాక్. బిజెపికి కాలం కలిసి వస్తే ఏకంగా జగన్ కూడా ఒక ‘చేయి’ వేయవచ్చని మరో టాక్.



