ఈ ఏడాది ఆర్థికశాస్త్రంలో నోబెల్ ప్రైజ్ను ముగ్గురికి ప్రకటించారు. భారత సంతతికి చెందిన అభిజిత్ బెనర్జీ తో పాటు ఆయన భార్య ఈస్తర్ డుఫ్లో, మైఖేల్ క్రీమర్ ఈ అవార్డును సంయుక్తంగా గెలుచుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా పేదరికాన్ని నిర్మూలించేందుకు ఈ ముగ్గురూ వినూత్న ప్రయోగాన్ని చేపట్టారని నోబెల్ కమిటీ తన ప్రకటనలో స్పష్టం చేసింది.
పిల్లల ఆరోగ్య పరిస్థితి మెరుగయ్యేందుకు కావాల్సిన అనేక అంశాలను వారి సిద్ధాంతంలో ప్రతిపాదించినట్లు నోబెల్ కమిటీ చెప్పింది. కెన్యా లాంటి ప్రాంతంలో పాఠశాల ఫలితాల అభివృద్ధిని మెరుగుపరిచిందన్నారు. భారత్ లాంటి దేశంలోనూ ఆర్థిక సూత్రాలు ఎంతో ఉపయుక్తంగా ఉన్నట్లు నిర్ధారణ అయినట్లు కమిటీ తెలిపింది.
కేవలం రెండు దశాబ్ధాల్లోనే ఈ ముగ్గురు ప్రతిపాదించిన పరిశోధనా సిద్ధాంతాలు ఆర్థికవ్యవస్థను మార్చేశాయన్నారు. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు ఈ ముగ్గురు ప్రతిపాదించిన నమోనాలను విశేషంగా వినియోగిస్తున్నట్లు కమిటీ చెప్పింది. ఆర్థికవేత్తల ప్రతిపాదన వల్ల సుమారు 50 లక్షల మంది భారతీయ చిన్నారులు లబ్ధి పొందినట్లు కూడా నోబెల్ కమిటీ వెల్లడించింది.
అభిజిత్ బెనర్జీ కోల్ కతా లో జన్మించారు. ఆయన అక్కడే తన స్కూలింగ్ తో పాటు బీ.ఎస్ డిగ్రీ పూర్తి చేశారు. ఢిల్లీలో ఎం.ఎస్ డిగ్రీ చేశారు. ఆ తరువాత తన పీహెడీ కోసం హార్వార్డ్ వెళ్లారు. అమెరికా పౌరసత్వం సాధించి ఇప్పుడు ఎంఐటీలో తన పరిశోధనలను కొనసాగిస్తున్నారు. డిసెంబర్ 10న నోబెల్ వర్ధంతి నాడు వీరికి అవార్డుల ప్రధానోత్సవం జరుగుతుంది.



