ప్రపంచ హిందీ దివస్ సందర్భంగా హోమ్ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. భారత దేశాన్ని ఏకతాటి పైకి తేగల సత్తా హిందీకి మాత్రమే ఉందని, ప్రపంచ వ్యాప్తంగా ఒక దేశానికి తనదైన గుర్తింపు ఉండాలంటే మన అందరికీ ఓ భాష తెలిసి ఉండడం అత్యావశ్యకమని ఆయన అన్నారు. ప్రజలంతా తరచూ హిందీ మాట్లాడేందుకు ప్రయత్నం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. తద్వారా మహాత్మాగాంధీ, సర్దార్ పటేల్ కలలు గన్న ‘‘ఒకే దేశం, ఒకే భాష’’ నినాదాన్ని నిజం చేయాలని ఆయన కోరారు.
‘‘మన దేశం విభిన్న భాషలకు నిలయం. ప్రతి భాషకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అయితే మొత్తంగా అందరికీ ఒక భాష తెలిసి ఉండడం చాలా అవసరం. ఇవాళ దేశాన్ని ఐక్యంగా ఉంచగల భాష ఏదైనా ఉందంటే అది అత్యధికంగా మాట్లాడే హిందీ మాత్రమే…’’అని పేర్కొన్నారు. భారత్లోని ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాలన్నింటా ప్రతి పిల్లాడికీ హిందీ బోధించడం జరుగుతుందని అమిత్ షా ఈ సందర్భంగా గుర్తుచేశారు. అయితే ఈ వ్యాఖ్యలపై వివిధ రాష్ట్రాల నుండి ప్రత్యేకంగా దక్షిణాది నుండి విమర్శలు వస్తున్నాయి.
హిందీ మా మాతృభాష కాదు… మా పై బలవంతంగా హిందీ రుద్దాలని చూస్తే ఊరుకోము అంటూ సోషల్ మీడియా హెచ్చరిస్తున్నారు. అమిత్ షా చేసిన ప్రకటనపై డీఎంకే అధినేత స్టాలిన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందీ భాషను బలవంతంగా రుద్దడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని ఆయన వ్యాఖ్యానించారు. ఇలాంటి ప్రకటనలు దేశ ఐక్యతను దెబ్బతీస్తాయన్నారు. అమిత్ షా తన ప్రకటనను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు





