
పోలింగ్ రోజున పోటెత్తిన ఓటర్లను చూసి మంత్రులు, వైసీపి నేతలు మొదట ఆందోళనతో గగ్గోలుపెట్టారు. ఈసారి టిడిపి కూటమి గెలువబోతోందని వారికీ అర్ధమైన్నట్లే ఉంది. కనుక పోలింగ్ ముగిసిన తర్వాత పలు జిల్లాలలో అల్లర్లు, విధ్వంసానికి పాల్పడ్డారు. తిరిగి టిడిపిని, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని, పోలీసులనే నిందించారు.
ఆ సమయంలోనే సజ్జల రామకృష్ణా రెడ్డి మీడియా ముందుకు వచ్చి ‘కౌంటింగ్లో కూడా టిడిపి ఏదో అక్రమాలకు పాల్పడబోతోందని’ అనుమానం వ్యక్తం చేశారు. వైసీపి నేతలు అల్లర్లు, విధ్వంసానికి పాల్పడితే, పిన్నెల్లి ఈవీఎంని ధ్వంసం చేస్తే అదీ టీడీపీ కుట్రే అని వైసీపి వాదించింది.
కనుక రేపు కౌంటింగ్లో కూడా ఇలాగే ఏదో గొడవ చేసి ఫలితాలను తారుమారు చేసే అవకాశం ఉన్నట్లే కనిపిస్తోంది. పోలింగ్లో జరిగిన అవకతవకలు, గొడవలు ఇవన్నీ ఓ ఎత్తు అయితే కౌంటింగ్ ఒక్కటే ఓ ఎత్తు. కనుక కౌంటింగ్ సక్రమంగా జరిపించడానికి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని టిడిపి నేతలు దేవినేని ఉమా, వర్ల రామయ్య తదితరులు రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈవో ముఖేష్ కుమార్ మీనాకు వినతి పత్రం ఇచ్చారు. ఆయన సానుకూలంగా స్పందించారు.
కానీ పోలింగ్ సమయంలో పలు జిల్లాలలో పెద్ద ఎత్తున అల్లర్లు జరిగినప్పటికీ, పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి పోలింగ్ బూత్లో జొరబడి ఈవీఎంని ధ్వంసం చేసినప్పటికీ, పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని ఎక్కడా రీపోలింగ్ అవసరం లేదని ముఖేష్ కుమార్ మీనా చెప్పారు. ఆ తర్వాత కేంద్ర ఎన్నికల కమీషన్ మొట్టికాయలు వేస్తే తప్ప పిన్నెల్లిపై చర్యలు తీసుకోలేదు.
కనుక కౌంటింగ్ సమయంలో మళ్ళీ వైసీపి మూకలు అల్లర్లకు, అవకతవకలకు పాల్పడకుండా అడ్డుకొని కౌంటింగ్ సజావుగా జరిపించలేకపోతే నష్టపోయేది ఆయన కాదు టిడిపి కూటమే. చేతులు కాలిన తర్వాత అప్పుడు ఆకులు పట్టుకొని ప్రయోజనం ఉండదు కూడా.
కనుక ఇప్పుడే ఈ కేంద్ర ఎన్నికల కమీషన్ని కలిసి రాష్ట్రంలో అన్ని కౌంటింగ్ కేంద్రాల వద్ద అదనపు కేంద్ర బలగాలను మోహరింపజేయాలని కోరడం మంచిది.
ప్రజలు టిడిపి కూటమికి అనుకూలంగా తీర్పు ఇచ్చినా, వైసీపి దానిని దౌర్జన్యంగా తమకు అనుకూలంగా మార్చుకోగలిగితే ఈ 5 ఏళ్ళ పోరాటాలు, శ్రమ, నేతలు, కార్యకర్తల త్యాగాలు అన్నీ వృధా అయిపోతాయి. ఒకవేళ ఈసారి టిడిపి కూటమి అధికారంలోకి రాలేకపోతే మరో 5 ఏళ్ళపాటు వైసీపి వేధింపులు, అరాచకాలు భరించలేక టిడిపి, జనసేన శ్రేణులు చెల్లాచెదురు అయిపోవచ్చు. రెండు పార్టీలను నామరూపాలు లేకుండా వైసీపి నేతలు తుడిచిపెట్టకుండా విడిచిపెట్టరు.
కనుక టిడిపి, జనసేనలకు ఇదే చిట్ట చివరి అవకాశం. ఈసారి ఎన్నికలలో ప్రచారం, వ్యూహాలు, డబ్బు, మద్యం పంపిణీ, పోలింగ్లో అరాచకాలు అన్నీ ఒక ఎత్తు అయితే, రేపు జూన్ 4వ తేదీన జరుగబోయే కౌంటింగ్ ప్రక్రియ ఒక్కటీ ఒక ఎత్తు. ఈ ఎన్నికలలో ఇదే గేమ్ చేంజర్ కాబోతోంది. కనుక కౌంటింగ్ ప్రక్రియను సజావుగా జరిపించుకోవలసిన అవసరం, బాధ్యత రెండూ టిడిపి కూటమికే ఎక్కువ ఉన్నాయి.
Indian politics are completely different breed altogether, considering the kind of tactics and gameplay that…
The high-stakes political thriller that gripped Tamil Nadu has finally hit its "mass" climax. After…