నవ్యాంధ్ర రాజధానికి భూములిచ్చిన రైతులకు ఏప్రిల్ నాటికి ప్లాట్లు కేటాయిస్తామని మంత్రి నారాయణ తెలిపారు. రాజధాని మాస్టర్ ప్లాన్ లో మార్పులు చేసే అవకాశం ఉందని, మార్పులు చేయడానికి ప్రజల అభిప్రాయాలను తీసుకుంటామని అన్నారు. ఈ మేరకు విజయవాడలో ప్రసంగించిన నారాయణ, రైతుల అభ్యంతరాలను ఫిబ్రవరి 1లోగా సీఆర్ డీఏకు తెలియజేయాలని, గ్రీన్ బెల్ట్ పై నిబంధనల ప్రకారమే ముందుకెళతామని మంత్రి చెప్పారు.
బీపీఎస్ (బిల్డింగ్ పీనలైజేషన్ స్కీం)ను ప్రజా అవసరాల రీత్యా మరో నెల రోజుల పాటు పొడిగిస్తున్నామని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గ్రామ శివారు వరకు రహదారుల నిర్మాణం పైన, గ్రామ కంఠాల పైన సీ.ఆర్.డీ.ఏ అధికారులు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. ఇక మంత్రి పుల్లారావుతో కలసి గ్రామాల్లో పర్యటించి… గ్రామ కంఠాలు, ఇతర సమస్యలపై రైతులతో చర్చిస్తామని నారాయణ తెలిపారు.





