’కేసీఆర్’ పుట్టినరోజును ఏపీ ప్రజలు జరుపుకునే ‘రోజు!’

ap people will celebrate kcr birthdayతెలంగాణా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పుట్టినరోజును టీఆర్ఎస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు ఘనంగా జరుపుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ కు కూడా కాలం కలిసి వస్తే, ఈ రోజును మరింత ఘనంగా జరుపుకునే పరిస్థితులు తలెత్తవచ్చని రాజకీయ విశ్లేషకుల అంచనా.

తాత్కాలిక సచివాలయానికి నేడు ఏపీ సిఎం చంద్రబాబు శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. రైతులు భూములు అప్పగించి దాదాపు ఏడాది కావస్తున్నా, ప్రభుత్వ పరంగా అమరావతి శంకుస్థాపన మినహా ఆ భూములలో చేసింది ఏమీ లేదు. అలాగే జనవరి నాటికి రైతులకు ప్లాట్లు విభాగాలు చేసి అప్పగిస్తామని చెప్పినప్పటికీ ఆ కార్యం కూడా నెరవేరలేదు. దీంతో రాజధాని గ్రామాల ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలలో కూడా అమరావతి నిర్మాణంపై సందేహాలు పెరుగుతూ వస్తున్నాయి.

ADVERTISEMENT

ఒక వైపు జగన్ ఏమో, తానూ అధికారంలోకి రాగానే ఈ భూములన్నీ తిరిగి ఇచ్చేస్తామని అంటున్నారు, మరో వైపు ప్రభుత్వ వైఖరి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది అని రైతులు మదనపడుతున్న వేళ, ఈ రోజు తాత్కాలిక సచివాలయానికి శంకుస్థాపన జరిగింది. దీనికి సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ వర్క్ ను కూడా విజయవంతంగా పూర్తి చేసిన ప్రభుత్వం, జూన్ 15 నాటికి సచివాలయ నిర్మాణం పూర్తి కావాలని లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఇప్పటివరకు జరిగిన పరిస్థితులను గమనిస్తే… దాదాపుగా 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం గల నిర్మాణాన్ని ఈ నాలుగు మాసాల్లో నిర్మించడం అసాధ్యంగా చెప్పాలి.

కానీ ప్రభుత్వం మాత్రం చేసి చూపిస్తామని ఖచ్చితంగా చెబుతోంది. ఇప్పటివరకు మాటలకు పరిమితమైన ఏపీ సర్కార్, చేతల్లో కూడా దీనిని నిరూపించిన రోజున ఖచ్చితంగా అమరావతి నిర్మాణంపై విశ్వాసం పెరుగుతుంది. అలాగే ప్రభుత్వ పరంగా కూడా ఆత్మ విశ్వాసం పెంపొందుతుంది. అంటే అమరావతి అభివృద్ధికి తాత్కాలిక సచివాలయ నిర్మాణం అనేది ఒక కీలక ఘట్టం. అంటే కేసీఆర్ పుట్టిన రోజున ప్రారంభమైన సచివాలయ నిర్మాణం ఎలాంటి ఆటంకాలు లేకుండా నిరాటంకంగా జరగాలి. అదే సాధ్యమైతే ప్రతి ఏడాది కేసీఆర్ పుట్టినరోజును అంధ్రప్రదేశ్ ప్రజలు తెలంగాణా వారి కంటే బాగా జరుపుకుంటారనడంలో సందేహం లేదు. ఆ రోజు రావాలని కూడా ఆశిద్దాం.

ADVERTISEMENT
Latest Stories