ఆసియా కప్ లో భాగంగా పాకిస్తాన్ తో తలపడ్డ బంగ్లాదేశ్ జట్టు పాక్ కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో పాక్ పేలవమైన ఫీల్డింగ్ మ్యాచ్ విజయాన్ని నిర్దేశించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్, నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి కేవలం 129 పరుగులు మాత్రమే నమోదు చేసింది. ఒకానొక దశలో 10 ఓవర్లకు 30 పరుగులు మాత్రమే చేసి 4 వికెట్లు కోల్పోయి, సెంచరీ మార్క్ ను కూడా అందుకుంటుందా లేదా అన్న సందేహం కలిగింది.
అయితే, సర్ఫరాజ్ అహ్మద్ 58 పరుగులతో నాటౌట్ గా నిలిచి పాక్ కు గౌరవప్రదమైన స్కోర్ ను అందించాడు. షోయబ్ మాలిక్ కూడా 41 పరుగులతో ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు. వీరిద్దరి బాధ్యతాయుతమైన బ్యాటింగ్ తో పాకిస్తాన్ జట్టు కనీసం 129 పరుగులైనా చేయగలిగింది. స్వల్ప లక్ష్య చేధనలో దుమ్ము రేపుతుందనుకున్న బంగ్లా బ్యాట్స్ మెన్లు ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ తక్కువ స్కోర్ కే అవుటైనా, మరో ఓపెనర్ సౌమ్య సర్కార్ అద్భుతమైన షాట్లతో స్కోర్ బోర్డును పెంచాడు.
మ్యాచ్ పూర్తిగా బంగ్లాదేశ్ వైపుకు తిరుగుతుందనుకున్న దశలో సర్కార్ 83 పరుగుల వద్ద మూడవ వికెట్ గా వెనుతిరిగడంతో పాక్ మ్యాచ్ పై పట్టు సాధించింది. ఆ వెనువెంటనే ముషాఫిర్ రహీమ్, షాకిబ్ హల్ హసన్ అవుటైనప్పటికీ, కెప్టెన్ మొర్తజా (7 బంతుల్లో 12) అండతో మహ్మదుల్లా (15 బంతుల్లో 22) పరుగులు చేసి మ్యాచ్ ను ముగించాడు. ఈ గెలుపుతో ఆదివారం నాడు భారత్ తో ఫైనల్ లో తలపడబోతోంది బంగ్లా జట్టు. శ్రీలంక, పాకిస్తాన్ లను వెనక్కి నెట్టి ఫైనల్లోకి బంగ్లాదేశ్ ప్రవేశించడం ఆసక్తికర పరిణామమే!



