గత నాలుగైదు రోజులుగా ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన భూమా నాగిరెడ్డి వ్యవహారం ఒక కొలిక్కి వచ్చినట్లే కనపడుతోంది. బహుశా దీనిపై అతి త్వరలోనే భూమా నాగిరెడ్డి నుండి ఒక అధికారిక ప్రకటన రాబోతోందని విశ్వసనీయ సమాచారం. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ వర్క్, ఇటు తెలుగుదేశం పార్టీ తరపు నుండి, అటు భూమా వైపు నుండి జరుగుతోందని తెలుస్తోంది.
సోమవారం కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో బిజీగా ఉన్న టీడీపీ అధినేత, సీఎం నారా చంద్రబాబునాయుడు నుండి కర్నూలు జిల్లా, నంద్యాల పార్టీ నేతలు ‘శిల్పా’ బ్రదర్స్ కు పిలుపు వచ్చింది. వెనువెంటనే విజయవాడ రావాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి మరియు ఆయన సోదరుడు మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డిలకు చంద్రబాబు కార్యాలయం నుంచి ఫోన్ వెళ్ళడంతో, హుటాహుటిన విజయవాడకు బయలుదేరారు. భూమాను పార్టీలో చేర్చుకునే విషయంపై సంప్రదింపులు జరిపేందుకే శిల్పా బ్రదర్స్ కు చంద్రబాబు కార్యాలయం నుంచి ఫోన్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో నిన్నటిదాకా భూమా చేరికపై కాస్తంత డైలమా నెలకొన్నా, శిల్పా బ్రదర్స్ కు చంద్రబాబు ఆఫీస్ నుంచి ఫోన్ తో భూమా చేరిక ఇక లాంఛనమేనన్న వాదన వినిపిస్తోంది.
మరోవైపు… గత అయిదారు రోజులుగా మీడియాకు కనిపించకుండా పోయిన భూమా కొద్దిసేపటి క్రితం బాహ్య ప్రపంచానికి తన ముఖం చూపించారు. హైదరాబాదులోని అసెంబ్లీ ప్రాంగణంలో జరుగుతున్న ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ) సమావేశానికి ఆయన చైర్మన్ హోదాలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యల కోసం మీడియా ప్రతినిధులు వేచి చూస్తున్నారు. పీఏసీ చైర్మన్ పదవికి భూమా రాజీనామా చేయనున్నారన్న వార్తలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. కమిటీ చైర్మన్ హోదాలో ఉన్న భూమా, పలు కీలక ఫైళ్లను కమిటీకి అప్పజెప్పాల్సి ఉన్న నేపథ్యంలోనే స్వయంగా సమావేశానికి హాజరయ్యారన్న వార్తలు కూడా హల్చల్ చేస్తున్నాయి.



