వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకా అమరావతి విషయం అగమ్యగోచరంగా మారిపోయింది. దీనితో రాజధాని రైతులు అన్ని పార్టీల నాయకులను కలిసి సాయం కోరారు. చంద్రబాబు సమయంలో అమరావతిని వ్యతిరేకించిన బీజేపీ, ఈ సారి మాత్రం వారికి తమ పూర్తి మద్దతు ప్రకటించింది. కన్నా లక్ష్మీనారాయణ, సుజనా చౌదరి ఇతర నేతలు రాజధాని గ్రామాలలో పర్యటించి వచ్చారు. ఇదే సమయంలో బీజేపీలోని మరో వర్గం ఇప్పటికీ రాజధానిని వ్యతిరేకిస్తుంది.
ఎవరి రాజధాని అమరావతి? అంటూ రాజధానికి వ్యతిరేకంగా ఒక పుస్తకమే రాసిన ఐవైఆర్ కృష్ణారావు ఎపిలో భారతీయ జనతాపార్టీ తెలుగుదేశం ఎజెండా కోసం పనిచేస్తున్నట్లు వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.దీనివల్ల బిజెపికి తీరని నష్టం జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అమరావతి విషయంలో పార్టీ వ్యవహారశైలి ఆయనకు మింగుడుపడటం లేదంట. మరోవైపు ఇటీవలే టీడీపీ నుండి బీజేపీలో చేరిన ఎంపీ, టీజీ వెంకటేష్ తో రాయలసీమ రాగం తీయిస్తున్నారు.
అప్పట్లో అమరావతి కాకుండా నాలుగు రాజధానులు రాబోతున్నాయి అని ఊదరగొట్టిన ఆయన ఇప్పుడు కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని, శ్రీబాగ్ ఒప్పందం అమలు జరగాలని డిమాండ్ చేస్తున్నారు. శ్రీభాగ్ ఒప్పందాన్ని భేఖాతర్ చేసి రాష్ట్ర రాజధానిని, రాష్ట్ర హైకోర్టును అమరావతిలో ఏర్పాటుచేసి రాయలసీమకు తీరని అన్యాయం చేసిందన్నారు. రాయలసీమలో రాష్ట్ర హైకోర్టుతో పాటు సెక్రటేరియట్, అసెంబ్లీని కూడా ఏర్పాటు చేయాలని, తమ డిమాండ్లను పట్టించుకోకుంటే రాయలసీమ రాష్ట్రం ఏర్పాటుకు ఉద్యమం చేపడతామని ఆయన చెప్పారు. ఇవన్నీ చూశాకా రాజధాని విషయంలో బీజేపీ డబల్ డ్రామా ఆడుతుందా? అని అనిపించకమానదు.





