కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్టు… బంగ్లాదేశ్ చేతిలో చావుదెబ్బ తిన్న పాకిస్తాన్ ఓటమికి కూడా అనేక కారణాలున్నాయి. బ్యాటింగ్ వైఫల్యం మొదలుకుని ఫీల్డింగ్ వరకు అనేక తప్పిదాలను చేసిన పాకిస్తాన్ జట్టు, మ్యాచ్ తన వైపుకు తిప్పుకున్న తరుణంలో పాకిస్తాన్ క్రీడాకారుడు మహ్మద్ సమి ప్రదర్శించిన ఆటతీరు చర్చనీయాంశమైంది.
లక్ష్య చేధనలో తుది దశకు చేరుకున్న తరుణంలో వరుసగా వికెట్లు పడుతూ బంగ్లా జట్టు తీవ్ర ఒత్తిడిలోకి వెళ్ళింది. షాకిబ్ హల్ హసన్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ మొర్తజా తొలి బంతిని బలంగా స్ట్రెయిట్ డ్రైవ్ ఆడగా, పట్టుకోవలసిన బంతిని సమి ఫీల్డింగ్ మిస్ చేయడంతో బంతి బౌండరీని దాటింది. ఆ మరుసటి బంతిని మరో బౌండరీ బాది, ఒత్తిడిని తగ్గించాడు మొర్తజా. ఇది ఫాస్ట్ బౌలర్ అమీర్ వేసిన 18వ ఓవర్ లో జరిగింది.
ఇక, చివరి రెండు ఓవర్లలో 18 పరుగులు చేయాల్సిన తరుణంలో బంతిని అందుకున్న మహ్మద్ సమి మొదటి మూడు బంతులను అద్భుతంగా సంధించాడు. అయితే నాలుగవ బంతిని ‘నో’ బాల్ గా వేయడంతో బంగ్లా జట్టు ఊపిరి పీల్చుకుంది. ‘ఫ్రీ హిట్’ బాల్ లో సింగిల్ పరుగే తీసినప్పటికీ మొత్తమ్మీద ‘నో’ బాల్ రూపేణా నాలుగు పరుగులు బంగ్లా ఖాతాలో జమయ్యాయి. ఈ తరుణంలో కూడా మ్యాచ్ ఇరు పక్షాల వైపు ఉండగా, 19వ ఓవర్ చివరి బంతిని కూడా ‘నో’ బాల్ వేయడం, దానిని బంగ్లా బ్యాట్స్ మెన్ మహ్మదుల్లా బౌండరీ దాటించడంతో, మ్యాచ్ బంగ్లా ఖాతాలోకి వెళ్ళిపోయింది.
కీలకమైన దశలో ఫీల్డింగ్ మిస్ ద్వారా ఒక బౌండరీని, బౌలింగ్ ద్వారా రెండు ‘నో’ బాల్స్ వేసి బంగ్లా విజయాన్ని శాసించాడు మహ్మద్ సమి. పాక్ ఆటగాళ్ళపై గతంలో వ్యక్తమైన ఆరోపణల రీత్యా, సమి ఆటతీరుపై పెద్ద చర్చే నడుస్తోంది. ఇదంతా చూస్తూ విస్తుపోవడం పాకిస్తాన్ కెప్టెన్ షాహిద్ అఫ్రిది వంతయ్యింది. మొత్తమ్మీద బంగ్లా ఫైనల్లోకి పంపి పాక్ పెవిలియన్ బాట పట్టింది.



