జీహెచ్ఎంసీ ‘ఓటింగ్’లో ప్రముఖుల జాబితా!

Celebs GHMC voting74 లక్షల మంది ఓటర్లున్న గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఓటింగ్ ప్రారంభమైంది. ఈ రోజు ఉదయం 7 గంటలకు తన కుటుంబంతో కలిసి వచ్చిన జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి, అమీర్ పేట వార్డు నెంబర్ 98లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ లో తొలి ఓటును వేసి పోలింగ్ ను ప్రారంభించారు. అనంతరం స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నాగిరెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

150 డివిజన్లకు గాను 100కు పైగా డివిజన్లలో పోలింగ్ ప్రారంభమవ్వగా, ఉప్పల్, రామాంతపూర్, కూకట్ పల్లి తదితర ప్రాంతాల్లో ఈవీఎం యంత్రాలలో సాంకేతిక లోపాలు తలెత్తడం వలన మొరాయించినట్టు తెలుస్తోంది. మరోవైపు పాతబస్తీ పరిధిలోని కొన్ని పోలింగ్ బూత్ ల వద్ద బీజేపీ,ఎంఐఎం ఏజంట్ల మధ్య వివాదం కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. పోలింగ్ స్టేషన్ల వెలుపల నిషేధాజ్ఞలు ఉన్నప్పటికీ, బీజేపీ – టీడీపీ కార్యకర్తలతో పాటు ఎంఐఎం, ఎంబీటీ పార్టీల కార్యకర్తలు మోహరించడంతో ఆయా ప్రాంతాలకు మరిన్ని బలగాలను తరలించారు.

ADVERTISEMENT

అయితే మొత్తమ్మీద అన్ని డివిజన్లలోని పోలింగ్ బూత్ ల వద్ద ఓటేసేందుకు వస్తున్న ప్రజల సంఖ్య స్వల్పంగానే ఉన్నట్టు తెలుస్తోంది. ఇక, ప్రముఖుల విషయానికి వస్తే… తాజా సమాచారం మేరకు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లో ఏర్పాటైన ఓ పోలింగ్ బూత్ లో తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ తన ఓటు హక్కును వినియోగించుకోగా, జూబ్లీహిల్స్ లో హిందుపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఓటేశారు అలాగే నారా లోకేష్, బ్రాహ్మణి, భువనేశ్వరిలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. లింగంపల్లిలోని 24వ పోలింగ్ కేంద్రంలో భాజాపా నేత కిషన్ రెడ్డి, రామ్ నగర్ లో బండారు దత్తాత్రేయలు ఓటేశారు.

ADVERTISEMENT
Latest Stories