గ్రేటర్ హైదరాబాదు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రచారం ప్రారంభించారు. పటాన్ చెరు నుంచి మొదలు పెట్టిన ప్రచారంలో ముఖ్యంగా హైదరాబాద్ – సికింద్రాబాద్ జంట నగరాల అభివృద్ధిలో తెలుగుదేశం పాత్ర ఏమిటో చెప్పుకొచ్చారు.
“హైదరాబాదుకు అంతర్జాతీయ స్థాయిని కల్పించింది టీడీపీ అని, తెలంగాణకు నిజమైన స్వాతంత్ర్యం తెచ్చింది దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అని, శంషాబాద్ విమానాశ్రయానికి ఎన్టీఆర్ పేరు పెట్టేందుకు ప్రభుత్వం సహకరించడం లేదని, మెట్రోరైల్ ప్రాజెక్టుకు అనుమతులు తెచ్చింది తానేనని, ఇప్పటికే పూర్తి కావాల్సిన మెట్రోరైల్ ప్రాజెక్టు ఇంకా ఎందుకు పూర్తి కాలేకపోయిందని” అధికార ప్రభుత్వ పనితీరును ఎండగట్టే ప్రయత్నం చేసారు.
సికింద్రాబాద్ ను నిర్మించేందుకు ఆంగ్లేయులకు వందేళ్లు పడితే, జంట నగరాలకు అంతర్జాతీయ స్థాయి కల్పించేందుకు తనకు కేవలం తొమ్మిదేళ్లు పట్టిందని, పేదలకు పక్కాఇళ్లు, రెండు రూపాయలకు కిలో బియ్యం, మరిన్ని పథకాలు ప్రవేశపెట్టిన ఘనత టిడిపిదేనని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు తనను విమర్శిస్తున్న నేతలంతా ఎక్కడి నుంచి వచ్చారని? ఆయన ప్రశ్నించారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా తెలంగాణ నుంచి తెలుగుదేశం పార్టీని ఎవరూ వేరు చేయలేరని ఆయన స్పష్టం చేశారు.





