జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం చివరి రోజు కావడంతో అన్ని పార్టీలు ముమ్మర కార్యక్రమాల్లో నిమగ్నమయ్యాయి. అయితే, చివరి రెండు, మూడు రోజులుగా అధికార పార్టీ టీఆర్ఎస్ నేతలు చేసిన ప్రచారాలు ఆ పార్టీకి ప్రతికూలంగా మారాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా తెలంగాణా ముఖ్యమంత్రి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబం నుండే భిన్న అభిప్రాయాలు వ్యక్తం కావడం పట్ల ప్లానింగ్ లోపం స్పష్టంగా కనపడుతోందన్నది విశ్లేషకుల వాదన.
కేసీఆర్ తనయురాలు కవిత ఇటీవల మాట్లాడుతూ… హైదరాబాద్ నగరంలో చంద్రబాబు అభివృద్ధిని తామూ గుర్తించామని చెప్పడం పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. అయితే ఇంతలోనే సిఎం కేసీఆర్ భారీ బహిరంగ సభలో చంద్రబాబుని ఏకరువు పెట్టే ప్రయత్నం చేసారు. ప్రసంగం ఆద్యంతం బాబుపై మండిపడిన కేసీఆర్, మాటల సందర్భంలో పలు అసత్యాలను కూడా ప్రస్తావించడం విశేషం. ఈ హడావుడి ముగియక ముందే కేసీఆర్ తనయుడు కేటీఆర్ చంద్రబాబుని ఉద్దేశిస్తూ మరో ప్రకటన చేసారు.
“విశ్వవ్యాప్తంగా హైదరాబాద్ ఈ పోసిషన్ లో ఉంచినందుకు చంద్రబాబు కృషిని అభినందించాలని, అయితే హైదరాబాద్ వంటి మహానగరం ఏ ఒక్కరిపైనో ఆధారపడి లేదని” అన్నారు. ఇలా చంద్రబాబుపై కేసీఆర్ కుటుంబంలో ముగ్గురు మూడు ప్రకటనలు ఇవ్వడం పట్ల పొలిటికల్ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదంతా ఒక్క చంద్రబాబుని టార్గెట్ చేసుకుని మాట్లాడడం వలన ఏర్పడిన పర్యవసానాలు.
మరో విశేషమేమిటంటే… ఏ “ఒక్కరి”పైనో ఆధారపడి హైదరాబాద్ వంటి నగరం అభివృద్ధి కాలేదన్న కేటీఆర్, హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దే సామర్ధ్యత “ఒక్క” కేసీఆర్ కే ఉందని చెప్పి, తానూ చెప్పిన వ్యాఖ్యానికి తానే అర్ధం లేకుండా చేసుకున్నాడని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.





