మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు. రానున్న ఎన్నికల నాటికి రాష్ట్రంలో అనేక రాజకీయ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని, ఆ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు ఉమ్మడిగా బరిలో దిగే అవకాశం ఉందని ఆయన చెప్పుకొచ్చారు. అలాగే దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముందుగానే వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జమిలి ఎన్నికలపై ఆసక్తిగా ఉన్నారన్నారు.
ప్రస్తుతానికి టీడీపీ బీజేపీ మధ్య సంబంధాలు దారుణంగానే ఉన్నాయి. టీడీపీని కబళించి ఆ స్థానాన్ని ఆక్రమించాలని బీజేపీ శతవిధాలా ప్రయత్నాలు చేస్తుంది. అయితే వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ బలపడకపోతే కచ్చితంగా టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలలో ఒకదానితో కలిసి వెళ్లే అవకాశం ఉంది. మైనారిటీ ఓట్ల కారణంగా వైఎస్సార్ కాంగ్రెస్ బహిరంగంగా బీజేపీతో కలవడం అనుమానమే. మరోపక్క టీడీపీ, జనసేన 2019లో పొత్తు పెట్టుకునే ప్రయత్నాలు చేశాయని చాలా మంది అంటుంటారు.
అయితే జనసేన తన బలాన్ని అతిగా ఊహించుకోవడం, టీడీపీ జనసేన బలాన్ని తక్కువ అంచనా వెయ్యడం వంటి పరిణామాలతో సీట్ల సర్దుబాటు కుదరలేదు. దానివల్ల ఎన్నికలలో రెండు పార్టీలు నష్టపోయాయి. రెండు పార్టీలు ముందుకు పోవడానికి ఒకరికొకరు సాయం అవసరమే. అయితే ఈ పొత్తు అనేది చెప్పినంత తేలికేమీ కాదు. అయితే ఈ విషయం అయ్యన్న మాట వరసకు అన్నారో లేక ఏదైనా నిర్దిష్టమైన సమాచారం ఉండి అన్నారో తెలియాల్సి ఉంది.





