సినీ ఇండస్ట్రీలో ‘మెగాస్టార్’గా వెలుగొందిన చిరంజీవి రాజకీయాల్లో మాత్రం తన మార్క్ ను చూపించలేక చతికిలపడ్డారు. ఎవరి ఓటు బ్యాంకింగ్ ను అయితే చిరంజీవి నమ్ముకుని వచ్చారో ఆ అభిమానులే మెగాస్టార్ కు ఓటు వేయలేకపోయారు. ఆ తదుపరి పర్యవసానాలు అందరికీ తెలిసినవే. అయితే రాజకీయ పరంగా మెగాస్టార్ ఎన్ని అనుభవాలు చవిచూసినా… చిరుకున్న క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. ఎక్కడికి వెళ్ళినా అభిమాన జనసందోహం ఎలాంటి పైకం చెల్లించకుండానే తరలి వచ్చారు, వస్తున్నారు కూడా..!
దానికి తాజా ఉదాహరణే… నేడు జరిగిన ఉదంతం. పశ్చిమ గోదావరి జిల్లా, పేరుపాలెం గ్రామాన్ని దత్తత తీసుకున్న చిరంజీవి, నేడు ఆ గ్రామాన్ని సందర్శించారు. దీంతో చుట్టుప్రక్కల ఉన్న గ్రామాల్లోని అభిమానులు, ప్రజలు కూడా చిరును వీక్షించడానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. అలాగే చిరు ప్రసంగిస్తున్న సమయంలో కూడా కేరింతలతో, ఈలలతో సభా వేదిక మారుమ్రోగింది. మెగాస్టార్ కు వచ్చిన స్పందన చూసి కాంగ్రెస్ నూతన ఉత్సాహంలో ఉంది. అయితే ఇవన్నీ ఓటు బ్యాంకింగ్ అనుకుంటే అంతకు మించిన పొరపాటు మరొకటి ఉండదు అని చెప్పడంలో సందేహం లేదు.
మరి అదే చిరు స్పెషాలిటీ. మెగాస్టార్ బలమూ, బలహీనత రెండూ అభిమానులే. సినీ పరంగా చిరంజీవికి ఏర్పడిన క్రేజ్ కు ప్రాంతాలతో సంబంధం లేకుండా అభిమాన గణం తండోపతండాలుగా వస్తారు, కానీ అదే అభిమాన గణం ఓటు వేయాలని మెగాస్టార్ కోరితే మాత్రం… “ఆ ఒక్కటి అడక్కు…” అంటారు. ఇలాంటి అనుభూతులు మెగా ఫ్యామిలీకి తప్ప మరొకరికి సాధ్యం కాదేమో!



