చిరు… దాసరిలంట… ఒక్కరైనా పనికొచ్చేవారున్నారా..!

Mudragada Padmanabhamఒక లక్ష్యం కోసం పాటుపడుతున్నపుడు అందరినీ కలుపుకోవాలనే భావన సరైనదే గానీ, కలుపుకుపోయే వారి వలన ఆ లక్ష్యానికి కాసింతైనా ఉపయోగం ఉంటుందా లేదా అన్నది కూడా ఉద్యమ నాయకుడు సమాలోచనలు చేసుకోవాలి. అప్పుడే అనుకున్న గమ్యానికి చేరుకోగలరు. ప్రత్యేక తెలంగాణా సాధన విషయంలో కేసీఆర్ అమలు పరిచిన సూత్రం కూడా ఇదే. మరి ఏపీలో కాపు ఉద్యమం పేరిట ముద్రగడ చేస్తున్నదేమిటి? లక్ష్యాన్ని అయితే ఏర్పరచుకున్నారు గానీ, దానికి సరైన దశ, దిశ లేదన్న విషయం ముద్రగడ వేస్తున్న అడుగులే చెప్తున్నాయి.

లక్షలాది ప్రజలను పోగు చేసి కాపుల సత్తా చాటుదామని జగన్ మద్దతు కోరిన తర్వాత తుని వేదికగా జరిగిన విధ్వంసం తెలిసిందే. అలా మొదటి తప్పటడుగు వేసిన ముద్రగడ, తాజాగా కాపులకు ప్రతినిధులుగా భావించి మెగాస్టార్ చిరంజీవి, దాసరి నారాయణరావులను కలిసి మద్దతు కోరారు. అయితే మద్దతిచ్చే స్థాయిలో వారు, ఉన్నా లేకున్నా… స్వయంగా ముద్రగడే అడగడంతో సంపూర్ణ మద్దతు ‘కాపు ఉద్యమానికే’ అంటూ ప్రకటించేసారు. దీని వలన ముద్రగడకు జరిగే లబ్ది కన్నా, నష్టమే ఎక్కువని భావించాలి.

ADVERTISEMENT

నేరుగా ప్రజల్లో బలంగా ఉన్న నేతల మద్దతు లభించినా ముద్రగడ చేస్తున్న ఉద్యమానికి కాసింత ఉపయోగం కలిగేది. కానీ, చిరంజీవి గానీ, దాసరికి గానీ, ప్రజా క్షేత్రంలో ప్రజల మద్దతు లేదన్న విషయం వారి రాజ్యసభ సభ్యత్వాలే చెబుతాయి. అలాగని విషయ పరిజ్ఞానం ఉన్న నేతలు కూడా కాదన్న విషయం వారి మాటలను చూస్తే ఇట్టే చెప్పేయవచ్చు. సదరు నేతల మద్దతు పేపర్ ప్రకటనలను నింపుకోవడానికి తప్ప ముద్రగడకు చేకూరే ప్రయోజనం శూన్యం అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

ADVERTISEMENT
Latest Stories