జీహెచ్ఎంసీ ఎన్నికలలో తన ఓటు హక్కును వినియోగించుకున్న నందమూరి బాలకృష్ణపై ఎలక్షన్ కమీషన్ కు ఫిర్యాదు వెళ్ళింది. తన ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత తెలుగుదేశం పార్టీకే ఓటు వేయండి అంటూ పొరపాటున నోరు జారినందుకు బాలయ్య తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అంతా అంచనా వేసారు. అయితే, అసలు ఓటు వేయడమే బాలయ్యకు అసలైన తలనొప్పిగా మారడం విశేషం.
ఆంధ్రప్రదేశ్ లోని హిందూపూర్ నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బాలకృష్ణ, హైదరాబాద్ లో ఓటు ఎలా వేస్తారంటూ ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చేసారు. దీంతో ఈ విషయంపై ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. అయితే, ఎవరు ఎక్కడైనా పోటీ చేయవచ్చని, దానికి ప్రాంతీయ బేధం లేదని, హైదరాబాద్ అడ్రస్ ఉన్న బాలయ్య హిందూపూర్ నుండి పోటీ చేయవచ్చని, అలాగే హైదరాబాద్ లో ఓటు వేయాల్సిన సమయంలో వేసుకోవచ్చని నిపుణులు వ్యక్తపరుస్తున్న అభిప్రాయం. అయితే ఏదైనా అధికారికంగా వస్తే ఆ తీరే వేరు కదా..!





