తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత 68వ పుట్టినరోజు వేడుకలను ఆ పార్టీ కార్యకర్తలే కాదు, సామాన్య ప్రజలు కూడా పెద్ద ఎత్తున జరుపుకుంటున్నారు. అభిమానంతో ‘అమ్మ’ అని పిలిచే జయలలిత ముఖచిత్రాలను ప్రజలు టాట్టూగా మార్చుకుని చేతిపై ముద్రించుకుంటున్నారు. సాధారణంగా ఇలాంటి కార్యక్రమాల్లో యూత్ ముందు వరుసలో ఉంటుంది. ఇలా అయితే ‘అమ్మ’ గొప్పతనం ఏముంది అనుకున్నారో ఏమో గానీ, ఓ వయసుకు చేరిన మహిళలు కూడా తమ చేతులపై టాట్టూలు వేసుకుని సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.
అంతేకాదు, దేవతల రూపంలో ‘అమ్మ’ బ్యానర్లు కూడా రాష్ట్ర వ్యాప్తంగా వెలిసాయి. మరో వైపు పార్టీ కార్యకర్తలు 68 కేజీల భారీ కేక్ ను సైతం సిద్ధం చేసారు. ఇలా ఒకటేమిటి ఎవరికీ తోచిన విధంగా వారు తమ ప్రియతమ ముఖ్యమంత్రి జయలలిత జన్మదినోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. ఈ వేడుకలు చూస్తున్న వారు… ‘దటీజ్ జయలలిత… దటీజ్ తమిళ ప్రజల అభిమానం…’ అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. అభిమానాన్ని ప్రదర్శించడంలో తమిళ ప్రజలకు మించిన వారు లేరన్నది జగమెరిగిన సత్యమే.



