గతంలో ప్రతిపక్షంలో ఉండగా అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని విమర్శించి, ఇబ్బంది పెట్టి వైఎస్సార్ కాంగ్రెస్ కు మేలు చేసిన ఏ ఒక్కరినీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మర్చిపోవడం లేదు. అప్పట్లో వాళ్ళు హెల్ప్ చేశారో లేక వారితో జగనే చేయించారో తెలీదు గానీ వారి రుణం మాత్రం తీర్చేసుకుంటున్నారు. తాజాగా ఎన్నికలకు ముందు టీడీపీ ప్రభుత్వం డేటా స్కాం అంటూ తెలంగాణ పోలీసులకు కంప్లయింట్ చేసిన లోకేశ్వరరెడ్డికి జగన్ కీలక పదవి ఇచ్చారు.
ఆయనను తన ఐటీ సలహాదారుగా నియమించుకున్నారు. ఆయనకు ప్రభుత్వపరంగా భారీగా జీతభత్యాలు కూడా ఇవ్వనున్నారు. ఇదంతా బానే ఉంది గానీ అసలు అప్పట్లో ఎన్నికల ముందు హడావుడి చేసిన టీడీపీ ప్రభుత్వం డేటా స్కాం ఎన్నికల తరువాత ఏమైందో ఎవరికీ తెలీదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వద్ద ఉండాల్సిన 3.7 కోట్ల ప్రజల సంపూర్ణ వివరాలు తెలుగుదేశం పార్టీకి చెందిన సేవామిత్ర యాప్ లో అందుబాటులోకి తెచ్చారు అనేది ఆరోపణ.
ఆ స్కాంకు సహకరించిన ఐటీ గ్రిడ్స్ సంస్థ సీఈఓ పరారీ, దానికి కోర్టులో కేసు అంటూ చాలా హడావిడి చేసారు. తెలంగాణ పోలీసులు మీడియాలో చేసిన హడావుడితో పూర్తిగా వైఎస్సార్ కాంగ్రెస్ కు సహకరించారు. ఎన్నికల తరువాత దాని ఊసు కూడా లేదు. మీడియా కూడా పట్టించుకోవడం లేదు. అది కేవలం అప్పట్లో ఎన్నికల ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మేలు చెయ్యడానికేనా అనే అనుమానాలు ప్రజలలో ఉన్నాయి. ఈ నియామకంతో ఆ అనుమానం మరింత బలపడుతుంది.





