దావోస్ పర్యటనలో భాగంగా సీఐఐ ఇన్వెస్టర్స్ మీట్ లో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు అనుకూలమైన అంశాలను క్లుప్తంగా వివరించారు. “రాష్ట్రంలోని సహజ వనరులు, అపార ఖనిజ సంపదతో పాటు వ్యవసాయ ఉత్పత్తులు, సుదీర్ఘ తీర ప్రాంతం” వంటి ప్రకృతి అందించిన వరాలతో పాటు, వీటన్నింటినీ మించే నైపుణ్యం కలిగిన మానవ వనరులు ఆంధ్రప్రదేశ్ సొంతమని” చంద్రబాబు వ్యాఖ్యానించారు.
“అద్భుతమైన వృద్ధి రేటుతో ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతోందని, సంక్షేమ కార్యక్రమాలపై ప్రధానంగా దృష్టిపెట్టామని, ఉపాధి అవకాశాలు గణనీయంగా పెంచగలిగామని, సంతులిత వృద్ధి ఏపీ ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని, అభివృద్ధికి నిధులు ఆటంకాలు కాదని, ప్రభుత్వ నిధులు వినియోగించకుండానే సైబరాబాద్ – హైదరాబాద్ లను అభివృద్ధి చేసి ప్రపంచ పటంలో పెట్టగలిగామని” చంద్రబాబు పేర్కొన్నారు.
తన జీవితంలో పదోసారి దావోస్ లో పర్యటిస్తున్నానని, ఇక్కడకు వచ్చిన ప్రతిసారి ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నానని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. పెట్టుబడి దారులను రాష్ట్రానికి ఆహ్వానించే కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలకు ఇన్వెస్టర్స్ నుండి మంచి స్పందన వచ్చింది.





