అమెరికాలో ఉన్న తెలుగు వారిని ప్రసన్నం చేసుకోవడానికా అన్నట్టు సాగుతుంది అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ ఇండియా పర్యటన. ఈ మధ్యనే నిర్మితమైన ప్రపంచంలోని అతిపెద్ద క్రికెట్ మైదానం మోతెరాలో ట్రంప్ కు స్వాగత కార్యక్రమం ఏర్పాటు చేసింది భారత ప్రభుత్వం. ఈ సమయంలో మాట్లాడుతూ ట్రంప్ మోడీని దేశాన్ని పొగడ్తలతో ముంచెత్తారు.
తన ప్రసంగంలో భారతీయ సంస్కృతి, ఆచార వ్యవహారాలు నుంచి క్రీడారంగం వరకు స్పృశించారు. ఆయన ప్రసంగంలో భారత క్రికెట్ గురించి, బాలీవుడ్ సినిమాల గురించీ ప్రస్తావించడం గమనార్హం. అంతర్జాతీయ క్రికెట్లో మేటి ఆటగాళ్లైన సచిన్ తెందూల్కర్, విరాట్ కోహ్లీ భారతీయులేనని ఆయన ప్రశంసించారు. గొప్ప క్రికెటర్లను ఈ దేశం అందించిందని తెలిపారు.
క్రికెట్ గురించి ఆయన ప్రస్తావించడంతో సభకు హాజరైన ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అలాగే బాలీవుడ్ సినిమాల గురించి కూడా ట్రంప్ ప్రస్తావించారు. “ఈ దేశంలో ఏడాదికి 2000 పైగా సినిమాలను బాలీవుడ్ నిర్మిస్తూ ఉంటుంది. భూమి మీద ఉండే ప్రజలంతా బాలీవుడ్ సినిమాలు చూడటానికి ఇష్టపడతారు. మరీ ముఖ్యంగా దిల్ వాలె దుల్హనియా లేజాయేంగే, షోలే వంటి సినిమాలు,” అని ఆయన అనడంతో అక్కడి వారంతా చప్పట్లతో హోరెత్తించారు.
అంతకు ముందు ఆయన అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి నేరుగా మహాత్ముని సబర్మతి ఆశ్రమానికి చేరుకున్నారు. ఆశ్రమ విశిష్టతను ట్రంప్ దంపతులకు ప్రధాని మోదీ వివరించారు. అనంతరం రాట్నంపై నూలు వడికిన ట్రంప్ దంపతులు.. సిబ్బంది ద్వారా దాని పనితనం గురించి తెలుసుకున్నారు. మొతేరా ఈవెంట్ తరువాత తాజ్ మహల్ సందర్శనార్ధం వారు అగ్ర వెళ్లారు.



