‘మీడియా’ నైతిక బాధ్యతల గురించి చర్చించుకోవాల్సిన వేదిక కానప్పటికీ, జగన్ మీడియా అనుసరిస్తున్న వైఖరితో ఏదొక సందర్భంలో ఈ అంశం హాట్ టాపిక్ అవుతోంది. ఈ విధమైన పరిణామాలతో మీడియా అంటే ప్రజలలో ఏహ్యభావన ఏర్పడేందుకు జగన్ కు చెందిన మీడియా తన పరిధికి మించిన ప్రయత్నాలు చేస్తోందన్నది విశ్లేషకుల మాట.
తాజాగా వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి వ్యవహారంలో జగన్ మీడియా ముద్రిస్తున్న కధనాలు, ఆ మీడియా దిగజారుడుతనాన్ని ప్రతిబింబిస్తున్నాయని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎంపీ మిథున్ రెడ్డి వ్యవహారంలో ఇటీవల విడుదలైన వీడియోలను ఉదాహరిస్తూ, సదరు వీడియోలలో అసలు ఎయిర్ పోర్ట్ మేనేజర్ లేరని, అధికార ప్రభుత్వం కావాలనే కక్ష్యపూరిత చర్యలు చేపడుతోందని ఆరోపణలు చేసింది.
ఒక వర్గానికి, ఒక పార్టీకి సంబంధించిన మీడియా కావడంతో ఇక్కడవరకు విమర్శలకు తావు లేని అంశం. అయితే ఇదే సందర్భంలో “ఆధారాలంటే ఇలా ఉండాలి” అంటూ తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి లోకేష్ ప్రైవేటు ఫోటోలను ప్రచురించింది. నిజానికి ఈ ఫోటోలకు, ఎంపీ మిథున్ రెడ్డి వ్యవహారానికి సంబంధం లేదు. ఈ కేసులో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు జగన్ మీడియా చేస్తున్న అత్యుత్సాహపు ప్రయత్నంగానే పరిశీలకులు భావిస్తున్నారు.
జగన్ మీడియా ప్రచురించిన ఫోటోలను చూస్తే… మిథున్ రెడ్డి అంశం పక్కనపెట్టి లోకేష్ ఫోటోలను చూడండి అన్నట్లుగా ఉంది. అయితే ఎవరి వ్యక్తిగత జీవితాలు వారికి ఉంటాయి, వారి ప్రైవేటు విషయాలలో మీడియా తల దూర్చడం అనేది ఆ మీడియాకు మరియు ఆ మీడియాను నడిపిస్తున్న వారి దిగజారుడుతనపు ఆలోచలనకు నిదర్శనమని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. జగన్ ఆస్తులకు సంబంధించి తప్ప ఆయన వ్యక్తిగత విషయాలలో ఏ మీడియా ఎప్పుడూ ఎలాంటి కధనాలను ప్రసారం చేయలేదన్న విషయాన్ని గుర్తించాలి. ‘కక్ష్య సాధింపు’ అనేది కొంత వరకే పరిమితమవ్వాలి, లేదంటే నేడు అభివృద్ధి చెందిన సాంకేతిక పరిజ్ఞానంతో అందరి “గుట్టు” ఇట్టే రట్టు చేయవచ్చు. ఇక్కడే వారి “నైతికత” బయటపడుతుంది మరి!





