‘ఫ్రీడమ్ 251’ పేరుతో ఫోన్ విడుదల చేయడం సంచలనాత్మకంగా మారిన వైనం తెలిసిందే. అయితే దీని వెనుక పెద్ద స్కాం ఉందని, అసలు ఈ రేంజ్ లో ఫోన్ ఇవ్వడం సాధ్యం కాదని మార్కెట్ వర్గాలతో పాటు నిపుణులు అభిప్రాయ పడ్డారు. సాధారణ మార్కెట్ ను పరిశీలించే ప్రజానీకానికి కూడా కొంత అనుమానాలు ఉన్న మాట వాస్తవమే. అయినప్పటికీ దాదాపు 7 కోట్ల మొబైల్స్ బుకింగ్స్ జరిగాయి. ఈ సమయంలోనే సదరు కంపెనీపై ఆదాయపు పన్ను శాఖ తనిఖీలు చేసారు. దీంతో గత వారం రోజుల్లో ‘రింగింగ్ బెల్స్’ సంస్థ పేరు దేశవ్యాప్తంగా మారు మ్రోగింది.
అయితే ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని వ్యాఖ్యానించిన ‘రింగింగ్ బెల్స్’ డైరెక్టర్ మోహిత్ గోయల్ తీవ్ర ఆవేదన వ్యక్తపరిచారు. “251 రూపాయలకు ఫోన్ విక్రయిస్తే తమకు వచ్చే లాభం 31 రూపాయలు అని, అయినా నన్నెందుకు ఇలా చుట్టుముడుతున్నారు? నేను ఏం తప్పు చేశాను? నేను గానీ, నా కంపెనీ గానీ ఎప్పుడైనా ఆదాయపు పన్ను ఎగ్గొట్టిన సందర్భాలు ఉన్నాయా? నాపై ఏనాడైనా పోలీసు స్టేషన్ లో కేసులు నమోదయ్యాయా? డబ్బుతో నేను పారిపోయిన సందర్భాలు ఉన్నాయా? 251 రూపాయలకు ఫోన్ విక్రయించడమే నేను చేసిన తప్పా?” అంటూ ఆవేదనతో కూడిన వ్యాఖ్యలు చేసారు.
“నేను ఒక స్టార్టప్ కంపెనీని ప్రారంభించాను. నా వ్యాపార ప్రణాళికలు నా వద్ద ఉన్నాయి” అంటూ ఓ జాతీయ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు. మొత్తం 7 కోట్ల రిజిస్ట్రేషన్లు వచ్చాయని, తొలి విడతలో 25 లక్షల స్మార్ట్ ఫోన్లు అందిస్తామని, జూన్ 30 లోగా మరో 25 లక్షల ఫోన్లు సరఫరా చేసేందుకు ప్రయత్నిస్తామని అన్నారు. కస్టమర్ల నుంచి వచ్చిన డబ్బును డెలివరీ తరువాతనే తాము తీసుకుంటామని అన్నారు.
మోహిత్ గోయల్ వ్యాఖ్యలను పరిశీలిస్తుంటే… మార్కెట్ వర్గాల నుండి, బడా పారిశ్రామిక వేత్తల నుండి పెద్ద ఎత్తున ఒత్తిడులు ఎదుర్కొంటున్నట్లుగా కనపడుతోంది. అందులో భాగంగానే ఐటీ తనిఖీలు, దుష్ప్రచారం పుట్టుకొచ్చాయని మోహిత్ వ్యక్తపరిచిన ఆవేదనలో అర్ధం తెలుసుకోవాలంటే, ముందుగా మొబైల్ మార్కెట్ లోకి ప్రవేశించాల్సిందే!



