గుంటూరు తూర్పు వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎండీ ముస్తఫా నిన్న గుంటూరులో ఎన్ఆర్సీ, సీఏఏ, ఎన్పీఆర్ లకు వ్యతిరేకంగా మజ్లీస్ పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు హాజరు అయ్యారు. ఈ క్రమంలో ఆయన ఆ సభలో చేసిన వ్యాఖ్యలు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని ఇరుకున పెట్టేవిగా ఉన్నాయి.
ఎన్ఆర్సీని ఇప్పటికే సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పందించారని, ముస్లింలకు ఇబ్బందిగా ఉండే ఈ చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయబోమని చెప్పారన్నారు. వచ్చే అసెంబ్లీలో ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా తీర్మానం చేస్తారని, అలా చేయకుంటే తన పదవికి రాజీనామా చేస్తానని ఆయన అంత మంది సాక్షిగా ప్రకటించేశారు.
ఎన్ఆర్సీని రాష్ట్రంలో అమలు చెయ్యబోమని జగన్ ప్రకటించిన మాట వాస్తవమే. అయితే ఏకంగా దానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చెయ్యడమంటే మోడీ అమిత్ షాలను ధిక్కరించినట్టే. అధికారంలోకి వచ్చిన నాటి నుండీ జగన్ కేంద్రంతో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.
తేడావస్తే కేసులతో ఇబ్బంది పెట్టే అవకాశం ఉండడంతో కేంద్రాన్ని ధిక్కరించడం లేదు. ఈ తరుణంలో ఎన్ఆర్సీ వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చెయ్యడమంటే రిస్కుతో కూడుకున్న విషయమే. ఒక రకంగా సొంత పార్టీ ఎమ్మెల్యేనే జగన్ ని బుక్ చేశారని అనుకోవచ్చు. చూడాలి జగన్ ఏం చెయ్యబోతున్నారో?



