తనతో 20 మంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని, తానూ కనుసైగ చేస్తే ప్రభుత్వం పడిపోతుందని చెబుతున్న వైసీపీ అధినేత జగన్ కు గట్టి షాక్ తగలనుందా? అంటే అవుననే అంటున్నాయి మీడియా వర్గాలు. పలు ఎలక్ట్రానిక్ మీడియా వర్గాల్లో హల్చల్ చేసిన వివరాల మేరకు నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డితో పాటు, ఆయన కూతురు ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే అఖిల్ ప్రియ మరియు మరో ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు ‘పసుపు’ జెండా పట్టుకోవడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. చర్చలన్నీ సఫలీకృతం అయితే అతి త్వరలోనే జగన్ ఈ “షాక్” తగలవచ్చని సమచారాం.
భూమా నాగిరెడ్డి పార్టీని వీడడమంటే సాధారణ విషయం కాదు. జగన్ బయటకు వచ్చిన నాటి నుండి పార్టీకి అండగా, కుటుంబానికి మనోధైర్యంగా ఉన్న భూమా మిక్కిలి విధేయుడిగా పేరు తెచ్చుకున్నాడు. అయితే తన భార్య అనురాధ మరణం నుండి భూమా వైఖరిలో మార్పు వచ్చినట్లుగా రాజకీయ వర్గాలు చెప్పుకుంటున్నాయి. అనురాధ మరణవార్త సమయంలో జగన్ ప్రవర్తన భూమాకు నచ్చలేదని, అప్పటినుండి అవకాశం కోసం ఎదురు చూసిన భూమా, తాజాగా దానికి ముహూర్తం పెట్టారని మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి.
ఈ పార్టీ మార్పు వార్తలు ఒక్క భూమా వరకే పరిమితం కాలేదు. తన కూతురుతో సహా మరో ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా సైకిల్ తొక్కడానికి సిద్ధమయ్యారని తేలడంతో జగన్ వర్గం మరోసారి అలెర్ట్ అవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. మరి వైసీపీ అధినేత గారు ఇప్పుడేం వ్యాఖ్యానిస్తారోనని రాజకీయ వర్గాలు ఎదురు చూస్తున్నాయి.




