
కేసీఆర్ ను గద్దె దింపి తెలంగాణలో ముఖ్యమంత్రి స్థానానికి వెళ్లడం అసలు సాధ్యమా.? అనుకున్న వారికీ అది సాధ్యమే అని చేసి చూపించారు రేవంత్. కాంగ్రెస్ పార్టీకి కూడా తెలంగాణలో అధికారంలోకి వస్తాం అనే నమ్మకం లేని పరిస్థితిలో అంత తానే అయ్యి పార్టీని ముందుకు తీసుకెళ్లి బిఆర్ఎస్ కుంభస్థలం మీద కొట్టారు రేవంత్.
దీనితో ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ ఊసు, రేవంత్ రెడ్డి పేరు దేశ వ్యాప్తంగా చర్చకు వచ్చింది. అయితే కాంగ్రెస్ పార్టీ అధినేతలే నమ్మని కార్యాన్ని చేసి చూపించి అతి తక్కువ సమయంలో కాంగ్రెస్ పార్టీ తరుపున సీఎం అభ్యర్థిగా ఎన్నికయ్యి తన మార్క్ చాటుకున్నారు రేవంత్.
అయితే అధికారం దక్కించుకునే వరకు రేవంత్ లో ఉన్న పట్టుదల, ఆవేశం పదవిలోకి రాగానే చేజారిందా అంటే ఏమో అనే సమాధానమే వినిపిస్తుంది. పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చి దాదాపు ఆరు మాసాలు గడుస్తున్నా ఇప్పటికి ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలు అమలు చేయలేక పోయారు.
అలాగే తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న హైద్రాబాద్ వంటి మహా నగరంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఏ ఒక్క పెద్ద పరిశ్రమ కూడా అడుగు పెట్టలేదు. రేవంత్ కు ఈ శాఖ మీద గట్టి పట్టుంది అంటూ ఇంతవరకు ప్రజలు కానీ ఆ పార్టీ నేతలు కానీ ఒక అభిప్రాయానికి రాలేకపోతున్నారు.
గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఐటీ మంత్రిగా పని చేసిన కేటీఆర్ హైద్రాబాద్ కు భారీ సంఖ్యలో పెట్టుబడులు రాబట్టుకొచ్చి ఐటీ మంత్రిగా తన మార్క్ చూపించారు. ఆ తరహా స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వ పని తీరు కనిపించడం లేదు. హైద్రాబాద్ బ్రాండ్ వాల్యుని పెంచుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క దిగ్గజ పరిశ్రమను కూడా తీసుకు రాలేకపోయింది.
అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడుస్తున్నా ఇంకా గత ప్రభుత్వ తప్పిదాలను వేలెత్తి చూపుతూ కాలం వెళ్లతీస్తుందే కానీ పాలనలో రేవంత్ రెడ్డి ముద్ర పడలేదనే చెప్పాలి. దొరల పాలన కాదు ప్రజా పాలన అంటూ ప్రగతి భవన్ ఇనుప గోడలను కూల్చి మార్పు చూపించిన రేవంత్ ఆ తరువాత సైలెంట్ అయిపోయారు.
పార్లమెంట్ ఎన్నికలలో కూడా ఖాళీ అయినా బిఆర్ఎస్ స్థానాన్ని బీజేపీ ఆక్రమించింది కానీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ దక్కించుకోలేక పోయింది. అధికారం అందిపుచ్చుకోవడానికి అలవు కానీ సంక్షేమ పథకాలను ప్రజలకు ఎరగా వేసి అధికారం అందుకోవడం, తీరా అధికారం వచ్చాక వాటి అమలుకు నానా తంటాలు పడడం రాజకీయ పార్టీలన్నిటికి సర్వ సాధారణ విషయంగా మారింది.
ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే అభివృద్ధిని పక్కన పెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. హామీలు అమలు చేయక పోయిన, తమ హయాంలో అభివృద్ధి జరగక పోయిన ఆ పార్టీల దుస్థితి ఎలా ఉంటుందో ఏపీలో వైసీపీ ని చూస్తే అర్ధమవుతుంది. అభివృద్ధి లేక పొతే ఎన్ని వేల కోట్ల బటన్లు నొక్కినా పోలింగ్ బూత్ లో పార్టీ గుర్తు మీద బటన్ నొక్కడానికి ఆసక్తి చూపడం లేదు ఓటర్లు.
ఇక్కడ కాంగ్రెస్ అయినా అక్కడ కూటమి ప్రభుత్వమైనా అభివృద్ధి సంక్షేమం రెండిటిని జోడెడ్ల బండి లా ముందుకు తీసుకు వెళ్లకపోతే ఆ తరువాత ఎన్నికలలో కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా అనర్హులుగా మిగలాల్సిందే అని చరిత్ర చెప్పిన పాఠాలు కళ్ళ ముందు కనిపిస్తూనే ఉన్నాయి. కాబట్టి కేసీఆర్ తో చేసిన పోరాటాల ఫలితం దక్కాలన్న రేవంత్ తన మార్క్ పాలన చూపిస్తూ ప్రజల నమ్మకం పొందాలి.
ఒక విజనరీ లీడర్ కింద బాబు, ఒక సంక్షేమ నాయకుడు కింద వైస్సార్, ఒక పోరాట స్ఫూర్తి గల నేతగా కేసీఆర్, ఒక కూల్చివేతల ముఖ్యమంత్రిగా జగన్ ఇలా ఎవరికీ వారు వారి రాజకీయాలలో తమ మార్క్ చూపిస్తున్నారు. రేవంత్ రెడ్డి కూడా ఈ రాజకీయం అనే పుస్తకంలో తనకంటూ కొన్ని పేజీలు రాసుకోవాలి. రేవంత్ అందుకు ఇంకెంత సమయం తీసుకుంటారు అనేదే ఇక్కడి ప్రశ్న.
Tamil Nadu politics delivered a clear verdict beyond the conventional favourites of DMK and AIDMK…
The much-awaited trailer launch event of Peddi is set to take place on May 16,…