భారత ప్రధాని నరేంద్ర మోడీని హతమార్చాలన్న లక్ష్యంతో ఐఎస్ ఉగ్రవాదులు చిన్నారి రూపంలో మానవ బాంబులను ప్రయోగించనున్నట్టు నిఘా వర్గాలు పసిగట్టాయి. గత సంవత్సరం స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఎర్రకోటకు వెళుతూ మార్గమధ్యంలో కనిపించిన చిన్నారుల వద్దకు ఆయన వెళ్లిన విషయాన్ని ఉగ్రవాదులు గమనించి, 12 నుంచి 15 ఏళ్ల వయసున్న వారితో మోడీపై దాడి జరిపించాలని ప్లాన్ వేసినట్టు ప్రధాని భద్రతను పర్యవేక్షించే ఎస్పీజీ అధికారులకు ఇంటెలిజెన్స్ బ్యూరో వర్గాల నుంచి సమాచారం వెళ్లింది.
ఆయుధాలు వాడటం, బాంబులు పేల్చడంలో వీరికి శిక్షణ ఇవ్వడంతో పాటు అవసరమైతే, తమను తాము పేల్చుకునేలా వీరికి కఠోర శిక్షణ ఇస్తున్నట్టు నిఘా అధికారులు గుర్తించారు. గణతంత్ర దినోత్సవం నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రధాని నరేంద్ర మోడీ సెక్యూరిటీ వలయాలను దాటుకుని ప్రజల వద్దకు వెళ్లకుండా చూడాలని సలహా ఇచ్చారు. ఇటీవల విడుదలైన ఓ ఐఎస్ వీడియోలో చిన్నారులకు శిక్షణ ఇస్తున్న దృశ్యాలు వెలుగుచూసిన సంగతి తెలిసిందే. దీంతో రిపబ్లిక్ డే కు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసారు.





