వర్షాలు – ట్రాఫిక్ కష్టాలు రెండు కవల పిల్లల మాదిరి కనిపిస్తాయి. వర్షాలు కురిస్తే రోడ్ల మీద ట్రాఫిక్ ఇబ్బందులు మొదలవ్వడం సర్వసాధారణముగా మారిపోయింది. మరి ముఖ్యంగా హైద్రాబాద్, బెంగళూర్, ముంబై వంటి మెట్రోపాలిటన్ సిటీలకు ఈ సమస్య ఒక అలవాటుగా తయారయ్యింది అంటే అతిశయోక్తి కాదేమో.
తాజాగా తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు హైద్రాబాద్, సైబరాబాద్ ప్రాంతాలలో వాహనదారుల ట్రాఫిక్ కష్టాలు తీవ్రతరమయ్యాయి. రహదారులలో నీరు నిండిపోవడం, గుంతలు, గతుకులతో రోడ్ల మీద కిలోమీటర్ల కొద్దీ వాహనాలు నిలిచిపోతున్నాయి.
దీనితో ట్రాఫిక్ కష్టాలను తగ్గించేందుకు అధికారులు ఐటీ సహా పలు కంపెనీలకు కీలక సూచనలు చేసారు. మరి ముఖ్యంగా సాయంత్ర వేళ ఈ సమస్య మరింత జటిలంగా మారడంతో దానిని కట్టడి చేసేందుకుగాను మధ్యాహ్నం 2 గంటల నుంచి ఉద్యోగులకు లాగౌట్ ఆప్షన్ అందుబాటులో ఉంచాలని సూచించారు.
ఒక వేళ కుదిరితే సదరు కంపెనీలు తమ ఉద్యోగులకు తాత్కాలికంగా వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం కల్పించాలంటూ విజ్ఞప్తి చేసారు. దీనితో రోడ్ల మీద అకనిసం కొంతమేరకైనా వాహనాల రాకపోకలు తగ్గుతాయని, తద్వారా హైదరాబాద్, సైబరాబాద్ వంటి ఐటీ ఉద్యోగుల ప్రాంతాలలో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టొచ్చని అధికారులు భావిస్తున్నారు.
అయితే హైద్రాబాద్ లో కురుస్తున్న భారీ వర్షాలకు మొదలైన ఈ ట్రాఫిక్ సమస్యలు మరి అధికారులు సూచించినట్టుగా ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఊరటను అందిస్తాయా.?



