తెలంగాణా గడ్డ మీద సవాళ్ళ వెల్లువ కొనసాగుతోంది. 100 స్థానాలతో గ్రేటర్ పీఠం కైవసం చేసుకోలేని పక్షంలో మంత్రి పదవి నుండి తప్పుకుంటానని కేటీఆర్ చేసిన ఛాలెంజ్ తెలిసిందే. ఆ తర్వాత ఈ సవాల్ పై కాస్త వెనుకడుగు వేసినప్పటికీ, తాజాగా మరో ముందడుగు వేసారు.
శుక్రవారం నాడు మధ్యాహ్నం 3.30 నిముషాలకు ప్రారంభం కానున్న గ్రేటర్ ఎన్నికల లెక్కింపులో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించని పక్షంలో తానూ పూర్తిగా రాజకీయాల నుండి తప్పుకుంటానని ప్రత్యర్ధి పార్టీలకు సవాల్ విసిరారు. పోలింగ్ తర్వాత వచ్చిన సర్వేలన్నీ టీఆర్ఎస్ కు అనుకూలంగా రావడమే కేటీఆర్ సవాల్ కు కారణమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
హైదరాబాద్ ప్రజానీకంపై అంతులేని విశ్వాసం ఉందని చెప్పిన కేటీఆర్, తినబోతూ రుచి ఎందుకని గ్రేటర్ ఫలితాలపై తనదైన నమ్మకాన్ని ప్రకటించారు. మరి కేటీఆర్ విసిరిన సవాల్ కు పర్యవసానం ఎలా ఉంటుందో తెలియాలంటే 5వ తేదీ సాయంత్రం అయిదు గంటల వరకు వెయిట్ చేయాలి.





