భారతీయ క్రికెట్ అభిమానులకు టీమిండియా రిపబ్లిక్ డే కానుకను అందజేసింది. ఆస్ట్రేలియాలో ప్రారంభమైన టీట్వంటీ సిరీస్ లో భాగంగా అడిలైడ్ లోని ఓవల్ మైదానంలో జరిగిన తొలి మ్యాచ్ లో భారత జట్టు మూడు బంతులు మిగిలి ఉండగానే 37 పరుగుల తేడాతో విజయం సాధించింది. చివరి వన్డేలో సాధించిన విజయం జోరును టీమిండియా ఈ మ్యాచ్ లో కూడా కొనసాగించింది. బ్యాటింగ్, బౌలింగ్ లో రాణించిన భారత జట్టు ఆసీస్ ఆటగాళ్లను వరుసగా పెవిలియన్ పంపి విజయాన్ని సొంతం చేసుకుంది. కేవలం 151 పరుగులకే ఆసీస్ ఆల్ అవుట్ అయింది.
189 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆసీస్ ఓపెనర్ ఆరోన్ ఫించ్ 33 బంతుల్లో రెండు సిక్సులు, నాలుగు ఫోర్లతో 44 పరుగులతో ధాటిగా ఆరంభించాడు. దీంతో ఆస్ట్రేలియా జట్టు కేవలం 5 ఓవర్లలోనే 50 పరుగులు సాధించింది. ఈ క్రమంలో బమ్రా సంధించిన షార్ట్ లెంగ్త్ డెలివరీని భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన డేవిడ్ వార్నర్ విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి వెనుతిరగగా, అశ్విన్ వేసిన అద్భుతమైన బంతితో ఫించ్ ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. జడేజా విసిరిన బంతిని స్వీప్ షాట్ కొడదామని ప్రయత్నించిన హెడ్ (2) దానిని అంచనా వేయలేక ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. అంతకు ముందు ధాటిగా ఆడుతున్న స్మిత్ (21)ను కోహ్లీ క్యాచ్ తో జడేజా పెవిలియన్ కు పంపాడు. అనంతరం అద్భుతమైన బంతితో అశ్విన్ షేన్ వాట్సన్ (12) పెవిలియన్ బాటపట్టించాడు. దీంతో మ్యాచ్ పై ఆసీస్ పట్టు కోల్పోయింది.
అంతకు ముందు బ్యాటింగ్ చేపట్టిన టీమిండియా ఓపెనర్లు… రోహిత్ శర్మ (31) ధాటిగా ఆడే క్రమంలో షేన్ వాట్సన్ వేసిన బంతికి మిడాన్ లో క్యాచ్ ఇచ్చి నిష్క్రమించగా, రోహిత్ అవుట్ కాగానే భారీ షాట్లకు యత్నించిన శిఖర్ ధావన్ (5)ను వాట్సన్ పెవిలియిన్ బాటపట్టించాడు. తరువాత క్రీజులోకి దిగిన విరాట్ కోహ్లీ (90), సురేష్ రైనా దూకుడుగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఆచి తూచి ఆడిన వీరిద్దరూ సందర్భోచితంగా భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో కోహ్లీ అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా, సురేష్ రైనాను జేమ్స్ ఫల్కనర్ బోల్తా కొట్టించాడు. దీంతో 175 పరుగుల వద్ద మూడో వికెట్ గా సురేష్ రైనా (41) వెనుదిరిగాడు. అనంతరం కెప్టెన్ ధోనీ (11) వస్తూనే సిక్సర్ తో తన ఉద్దేశ్యమేమిటో ఆసీస్ బౌలర్ కు చెప్పాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయిన భారత జట్టు 188 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది.





