
ప్రజలు ఒక పార్టీ లేదా కూటమిని కాదనుకొని మరో పార్టీ లేదా కూటమికి అధికారం కట్టబెట్టడం సహజం. ప్రజాస్వామ్యం గొప్పదనమే అది. కనుక ప్రజల తీర్పుని ఓడినవారు తప్పనిసరిగా గౌరవించాల్సిందే. అలాగే గెలిచినవారు ప్రజలు తమని ఎందుకు గెలిపించారో కూడా అనుక్షణం గుర్తుంచుకొని వారి ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాల్సిందే.
ప్రజలు ప్రజాస్వామ్యం ప్రకారం పోతున్నారు కానీ అధికార, విపక్షాలు మాత్రం ప్రజాస్వామ్యాన్ని, ప్రజల సమస్యలను, వారి ఆకాంక్షలను, చివరికి వారి తీర్పుని కూడా గౌరవించడం లేదు.
తాము చేసిందే పాలన! తమకు నచ్చినట్లే, తాము చెప్పినట్లుగానే ప్రభుత్వాలు పని చేయాలని ప్రతిపక్షాలు కోరుకుంటున్నాయి. లేకుంటే అసమర్ధ, అవినీతి ప్రభుత్వాలని ముద్ర వేసి దుష్ప్రచారం చేస్తున్నాయి. అయితే ప్రతిపక్షాలు కోరుకున్నట్లు ప్రభుత్వాలు పనిచేయాలంటే ప్రజలు వాటిని ఎన్నుకోవడం దేనికి?
ఈ కారణంగా ప్రభుత్వాలు కూడా ప్రతిపక్షాల సూచనలు, అభిప్రాయాలను పట్టించుకోవడం మానేశాయి. అది తప్పని, రాష్ట్రానికి, దేశానికి, ప్రజలకు నష్టమని తెలిసి ఉన్నా తమకు నచ్చినట్లే పాలన సాగిస్తున్నాయి. తమ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగానే నిర్ణయాలు తీసుకుంటున్నాయి.
కనుక ఇప్పుడు ఒక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను, మొదలుపెట్టిన పనులను మరో ప్రభుత్వం అంగీకరించడం లేదు. ఒక ప్రభుత్వం చేస్తున్న పనులన్నీ అవినీతి, అక్రమాలమయమే అని వాదించడం పరిపాటిగా మారిపోయిందిప్పుడు.
పార్టీలు, వాటి నేతలు, ప్రభుత్వాలు ఏమీ ఆకాశం నుంచి ఊడిపడలేదు. కనుక తప్పొప్పులు సహజం. కనుక ప్రభుత్వాలు తప్పులు చేస్తున్నప్పుడు ప్రతిపక్షాలు వారించాలి. ఇదీ తప్పని వివరించి గాడిలో పెడుతుండాలి.
ఇదివరకు చంద్రబాబు ప్రభుత్వం తప్పటడుగులు వేస్తున్నప్పుడు వైసీపీ, జగన్ ప్రభుత్వం తప్పటడుగులు వేస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు అలాగే హెచ్చరించుకున్నారు. అదేవిధంగా కేసీఆర్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ, రేవంత్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్, బిజేపిలు హెచ్చరిస్తున్నాయి.
ప్రభుత్వాలు తప్పటడుగులు వేస్తున్నప్పుడు ప్రతిపక్షాలు చేసే హెచ్చరికలు నిర్మాణాత్మకమైనవి కనుక వాటిని స్వాగతించాల్సిందే. కానీ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు.
అదేవిధంగా ప్రభుత్వం తీసుకునే ప్రతీ నిర్ణయం, చేపట్టే ప్రతీ పనిని గుడ్డిగా వ్యతిరేకించడం, తప్పుడు ఆరోపణలు చేయడం, ముఖ్యమంత్రులని ఉద్దేశ్యించి అనుచిత వ్యాఖ్యలు చేయడమే సరైన రాజకీయం అనుకునే ప్రతిపక్షాలే ఎక్కువగా ఉన్నాయిప్పుడు.
పార్లమెంటులో ప్రవేశపెడుతున్న డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులు మొదలు కాళేశ్వరం-మూసీ ప్రాజెక్టు, అమరావతి-మావిగన్ వరకు అంతటా ఇదే ధోరణిలో సాగిపోతున్నాయి అధికార విపక్షాలు.
Earlier today, it has been confirmed that why is Jagan has secured the permission from…
Getting an IPL ticket has become difficult for many fans, and a recent incident in…