దక్షిణాదిలో టాప్ హీరోయిన్ గా చలామణి అవుతున్న నయనతారను మలేషియా విమానాశ్రయంలో ఇబ్బందులకు గురయ్యారా? అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. విక్రం హీరోగా నటిస్తున్న “ఇరుముగన్” అనే తమిళ సినిమాలో షూటింగ్ నిమిత్తం మలేషియా వెళ్ళిన నయనతార తిరిగి పయనమైన సందర్భంలో మలేషియా రాజధాని కౌలాలంపూర్ ఎయిర్ పోర్టులో విచారణ పేరుతో అదుపులోకి తీసుకుని చాలా సేపు ప్రశ్నలు వేసినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
పాస్ పోర్టులో ఉన్న నయనతార ఫోటోకు మరియు ఆమె పేరులో మార్పులు ఉండడమే దీనికి కారణంగా చెప్పారట. అయితే గురువారం అర్ధరాత్రి నుండి ఉదయం వరకు అనేక ప్రశ్నలను సంధించిన నయనతారపై పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చిన తర్వాత తిరిగి వెళ్లేందుకు అనుమతి ఇవ్వడంతో ఈ ఉదంతానికి శుభంకార్డు పడినట్లుగా సమాచారం. ఇందులో వాస్తవమెంత ఉందో గానీ, ఇందు నిమిత్తం హైదరాబాద్ లోని పలువురి సహాయం నయనతార పొందినట్లుగా తెలుస్తోంది. బహుశా సదరు సినిమా ప్రమోషన్స్ సమయంలో ఈ వార్తలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.





