నేతాజీ సుభాష్ చంద్రబోస్ గురించిన రహస్య ఫైళ్లలోని కీలక సమాచారం ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తోంది. నేతాజీ మరణ వార్త గురించి, ఆయనతో విమానంలో ప్రయాణించిన హబీబుర్ రెహమాన్, మహాత్మా గాంధీకి చెప్పిన వేళ, ఆయన ఆ విషయాన్ని నమ్మలేదని తెలుస్తోంది. “సుభాష్ విమాన ప్రమాదంలో మరణించాడంటే నేను నమ్మను. ఆయన కర్మకాండలు జరిపించవద్దు” అని గాంధీ వ్యాఖ్యానించినట్టు బోస్ కుమారుడు అమియానాథ్ బోస్ తెలిపినట్టు ఉన్న ఓ ఫైల్ వెలుగులోకి వచ్చింది.
దీని గురించి 1995లో పీవీ నరసింహరావు ప్రధానిగా ఉన్న సమయంలో కూడా చర్చ జరిగింది. ఆ సమయంలో బోస్ అస్థికలను ఏం చేయాలని కోరుతూ జపాన్ నుంచి లేఖ రాగా, దానిపై చర్చించిన పీవీ మంత్రివర్గం, బోస్ అస్థికలను ఇండియాకు తీసుకురాకూడదని అభిప్రాయపడింది. వాటిని తీసుకువస్తే, ఆయన బతికున్నట్టు నమ్ముతున్న బెంగాల్ ప్రజల మనోభావాలు దెబ్బతింటాయని, పైగా ఏ వర్గం నుంచి కూడా ఆయన అస్థికలని తీసుకురావాలని డిమాండ్ రావడం లేదని పీవీ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ‘నేతాజీ యాషెస్ ఇన్ టోక్యో’ పేరిట ఉన్న నోట్ ఫైల్ విడుదలైంది.
ఇదిలా ఉండగా, 1945, డిసెంబర్ 27న జవహర్ లాల్ నెహ్రూ రాసినట్టుగా ఉన్న ఓ లేఖ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టిస్తోంది. నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ ల మధ్య విభేదాలు ఉన్నాయనడానికి సాక్ష్యంగా నిలుస్తోంది. అప్పటి ఇంగ్లండ్ ప్రధాని క్లెమెంట్ అట్లీకి నెహ్రూ రాసిన లేఖలో సుభాష్ చంద్రబోస్ ను “యుద్ధ ఖైదీ”గా నెహ్రూ అభివర్ణించారు. “డియర్ మిస్టర్ అట్లీ…” అంటూ ప్రారంభమైన లేఖలో, తనకున్న సమాచారం మేరకు ‘’మీ యుద్ధ ఖైదీ’’ స్టాలిన్ ప్రోద్బలంతో రష్యాలోకి ప్రవేశించాడని, రష్యన్లు నమ్మకద్రోహం చేశారని వ్యాఖ్యానించారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ లేఖ, రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి కొంత ఇబ్బందులు కలిగించవచ్చని అంచనా వేస్తున్నారు.






