తునిలో జరిగిన కాపు గర్జన తరువాత ఏర్పడిన హింసాత్మక పరిస్థితులను ముందుగానే అంచనా వేయడంలో నిఘా వర్గాలు వైఫల్యం చెందాయని చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిఘా వర్గాలతో పాటు పోలీసులు, మీడియా సైతం కుట్ర జరుగుతోందని అంచనా వేయలేకపోయాయని అభిప్రాయపడ్డారు.
సామాజిక శ్రేయస్సు కోసం తాము ఆలోచిస్తుంటే, కేవలం ఆరేడు వాహనాల్లో వచ్చిన వారు హింసకు పాల్పడ్డారని, వీళ్లపై పోలీసు చర్యలే ఏకైక మార్గమని అధికారులతో వ్యాఖ్యానించిన చంద్రబాబు కఠిన చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు. తాజా పరిస్థితులు ఒక్క తునికే పరిమితం కాలేదు. తూర్పు గోదావరి జిల్లాలోని పలు ప్రాంతాలతో పాటు నవ్యాంధ్ర పొలిటికల్ కేపిటల్ విజయవాడలోనూ హై టెన్షన్ నెలకొంది.
ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరిన ఆర్పీఎఫ్, సీఆర్పీఎఫ్ బలగాలు నిన్న రాత్రికే విశాఖ చేరుకున్నాయి. మరికాసేపట్లో ఆ బలగాలన్నీ తునికి చేరుకోనున్నాయి. కాపులకు బీసీ రిజర్వేషన్లు కల్పిస్తూ నేటి సాయంత్రంలోగా స్పష్టమైన జీవో రావాలని, లేని పక్షంలో తాను ఆమరణ దీక్షకు దిగుతానంటూ కాపు నేత ముద్రగడ పద్మనాభం ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. ఈ క్రమంలో పరిస్థితులు మరోమారు చేయి దాటిపోకుండా ఉండేందుకే కేంద్ర బలగాలు రంగంలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది.
ప్రభుత్వం నుంచి ప్రకటన రాని పక్షంలో విజయవాడలోనూ ఆందోళనకు దిగేందుకు కాపులు సన్నాహాలు చేస్తున్నారన్న వార్తల నేపథ్యంలో అక్కడ కూడా హై టెన్షన్ వాతావరణం నెలకొంది. దీనిపై ఇప్పటికే స్పష్టమైన సమాచారం అందుకున్న పోలీసులు విజయవాడ నగరంలో పెద్ద ఎత్తున మోహరించారు. సీఎం క్యాంపు కార్యాలయం సమీపంలో వేల సంఖ్యలో పోలీసు బలగాలను రంగంలోకి దిగారు.





