జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘనవిజయం సాధించిందన్న విషయంతో అసలు ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయన్న అంశానికి ఎవరూ పెద్దగా ప్రాధాన్యతను ఇవ్వలేదు. మేయర్ పీఠానికి కావలసిన మ్యాజిక్ ఫిగర్ 76ను అతి తేలికగా దాటేయడంతో ఇక ఫలితాలపై ఆసక్తి పోయింది. కానీ, 100 సీట్లు కొడతామని చెప్పిన టీఆర్ఎస్ ఆ లక్ష్యాన్ని అందుకుందా? 110కి పైగా స్థానాలలో ఆధిక్యాన్ని ప్రదర్శించిన అధికార పార్టీకి చివరికి ఎన్ని సీట్లు వరించాయి?
టీఆర్ఎస్ నిర్దేశించుకున్న లక్ష్యానికి ఒక అడుగు దూరంలో నిలిచిపోవడం విశేషం. తమకు 100 సీట్లు ఖచ్చితంగా వస్తాయని చెప్పిన కేటీఆర్ వ్యాఖ్యలకు ప్రజలు ఇచ్చిన సమాధానం 99 సీట్లు. అయితే గెలుపొందిన అభ్యర్ధులందరూ కూడా భారీ మెజారిటీలతో విజయం సాధించడం విశేషం. సీతాఫల్ మండి నుండి టీఆర్ఎస్ తరపున పోటీ చేసిన హేమ 15418 ఓట్లతో అత్యధిక మెజారిటీతో మొదటి స్థానంలో నిలిచారు.
ఇక, మిగతా పార్టీల విషయానికి వస్తే ఎంఐఎం 44 స్థానాలతో సత్తా చాటగా, బిజెపి 4, టిడిపి 1, కాంగ్రెస్ 2 స్థానాలతో సరిపెట్టుకున్నాయి. టిడిపి, కాంగ్రెస్ పార్టీల పరిస్థితి అత్యంత దయనీయమైన పరిస్థితికి చేరుకోవడం విశేషం. 132 సంవత్సరాల జాతీయ పార్టీ కాంగ్రెస్ తన ఉనికిని చాటుకోవడంలో పూర్తిగా విఫలమవ్వగా, ఇటీవలే జాతీయ పార్టీగా ఆవిర్భవించిన టిడిపికి ఇది కోలుకోలేని దెబ్బ.





