213 పరుగుల భారీ ఆధిక్యంతో సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియా తొలి 4 వికెట్లను 57 పరుగులకే కోల్పోయింది. మురళి విజయ్ (3), రోహిత్ శర్మ (0) వికెట్లను 8 పరుగుల వద్దే కోల్పోయిన టీమిండియాను శిఖర్ ధావన్ (21), పుజారా (28) గాడిలో పెట్టే ప్రయత్నం చేసారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లి, అజేంకా రెహానేలు బాధ్యతాయుతమైన బ్యాటింగ్ తో ఇన్నింగ్స్ ను చక్కదిద్దారు.
కెప్టెన్ కోహ్లి దూకుడైన షాట్లతో 154 బంతుల్లో 10 ఫోర్లతో 83 పరుగులు చేయగా, రెహానే 152 బంతుల్లో 5 ఫోర్లతో 52 పరుగులతో క్రీజులో ఉన్నారు. మూడవ రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది. కోహ్లి – రెహానేల మధ్య నమోదైన అబేధ్యమైన 133 పరుగుల భాగస్వామ్యమే ఈ టెస్ట్ సిరీస్ మొత్తానికి అత్యధిక పార్టనర్ షిప్.
ఇప్పటికే 403 పరుగుల లీడ్ లో ఉన్న టీమిండియా నాలుగవ రోజు కోహ్లి సెంచరీ పూర్తవ్వగానే డిక్లేర్ చేసే అవకాశం ఉంది. పిచ్ స్పిన్ కు అనుకూలంగా ఉండడంతో టీమిండియా స్పిన్నర్ల ధాటికి సఫారీలు చేజ్ చేయడం అసాధ్యమనే చెప్పవచ్చు. అన్నీ అనుకూలిస్తే నాలుగవ రోజే ఫలితం తేలిపోవచ్చు.





