తెలంగాణా గడ్డ మీద రోజు రోజుకు తెలుగుదేశం పతనమవుతుండడం, టీఆర్ఎస్ బలపడుతుండడం… రెండూ ఒకేసారి జరుగుతున్నదే. ఒకప్పుడు ఎర్ర సైన్యానికి పెట్టని కోటలా ఉండే ఖమ్మం జిల్లా స్వర్గీయ ఎన్టీఆర్ స్థాపించిన టిడిపితో పసుపు వర్ణమైంది. అయితే తాజాగ ఏర్పడుతున్న రాజకీయ పరిణామాలు మాత్రం ఆ పసుపు వర్ణాన్ని కబలించే విధంగా ‘గులాభీ’ వర్ణం కొత్త రూపును సంతరించుకుంటోంది.
ఖమ్మం జిల్లా, కొత్తగూడెంలో గత మూడు దశాబ్దాలుగా టిడిపికి అండగా ఉన్నటువంటి “కోనేరు” కుటుంబం త్వరలోనే గులాభీ కండువా కప్పుకోవడానికి సిద్ధమైనట్లు రాజకీయ వర్గాల సమాచారం. దీనికి సంబంధించి సిఎం కేసీఆర్ – కోనేరు నాగేశ్వరరావుల మధ్య చర్చలు కూడా జరిగాయని, సిఎం నుండి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చిందని టాక్. తన సోదరుడి కుమారుడి వివాహం అనంతరం ఈ కార్యక్రమానికి ‘ముహూర్తం’ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.
నిజానికి 2014 ఎన్నికల ముందే కోనేరు నాగేశ్వరరావు తనయుడు చిన్ని టీఆర్ఎస్ తరపున పోటీ చేస్తారని రాజకీయ వర్గాల్లో బలమైన ప్రచారం జరిగింది. అయితే చిన్నికి, బాలకృష్ణకు ఉన్న సత్సంధాలు బ్రేక్ వేశాయని, అయితే తాజా రాజకీయ పరిణామాలు మాత్రం టీఆర్ఎస్ కు అనుకూలంగా ఉండడంతో పాటు టిడిపి అత్యంత దయనీయమైన పరిస్థితులకు చేరుకుంటుండడంతో పార్టీ మార్పు అనివార్యం కనుక ‘గులాభీ’ దళం వైపుకే మొగ్గు చూపాలని నిర్ణయం తీసేసుకున్నారట. ఈ పరిణామాలు టిడిపి వర్గాలను మరింతగా కృంగదీస్తాయని పొలిటికల్ వర్గాలు చెప్పుకుంటున్నాయి.



