గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. నగరంలోని వీధులన్నీ డప్పుల మోతలు, కోలాటాలతో సందడిగా మారాయి. అన్ని ప్రధాన పార్టీలు తమ తురుపు ముక్కలను రంగంలోకి దించాయి. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు మరియు టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు వారసులుగా రంగంలోకి దిగిన నారా లోకేశ్, కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్)ల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.
ప్రచారంలో భాగంగా… నారా లోకేశ్ హైదరాబాద్ అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ అభివృద్ధి టీడీపీ చలవేనని, ఇందుకు ఆయన ఓ ఉదాహరణను కూడా చెప్పారు. హైదరాబాద్ పేరును గూగుల్ లో సెర్చ్ చేస్తే, మూడు ఫొటోలు కనిపిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఆ మూడు ఫొటోల్లో ఒకటి చార్మినార్, రెండోది బుద్ధుడి విగ్రహం, మూడోది హైటెక్ సిటీ అని తెలిపారు. వీటిలో చారిత్రాత్మక కట్టడం చార్మినార్ ను మినహాయిస్తే… బుధ్దుడి విగ్రహాన్ని టీడీపీ వ్యవస్థాపకుడు, తన తాత నందమూరి తారకరామావు ఏర్పాటు చేయగా, తన తండ్రి చంద్రబాబు హైటెక్ సిటీని నిర్మించారని పేర్కొన్నారు.
దీంతో ఈ వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. హైదరాబాద్ అభివృద్ధి తమ వల్లే సాధ్యమైందని జబ్బలు చరుచుకుంటున్న టీడీపీ, చివరకు చార్మినార్ కూడా తమ నిర్మాణమేనని చెప్పుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని దెప్పి పొడిచారు. హైదరాబాద్ లో కనీసం రోడ్లు లేని బస్తీలు ఇంకా ఉన్నాయని, ఈ పాపమంతా టీడీపీతో పాటు కాంగ్రెస్ పార్టీ నేతలదేనని ఆయన విమర్శించారు. హైదరాబాదు నగరాన్ని ఈ రెండు పార్టీలు నాశనం చేశాయని అన్న కేటీఆర్ తన తండ్రి “కేసీఆర్ లాంటి వ్యక్తి యుగానికి ఒక్కరు మాత్రమే పుడతారని” ఆకాశానికెత్తేసారు.





