వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా తీవ్రవాది కన్నా ప్రమాదకరమని పాయకరావు పేట ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ మహిళా నేత అనిత వ్యాఖ్యానించారు. తనపై రోజా చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా కలచి వేశాయని, రోజాపై ఒక కోటి రూపాయల పరువు నష్టం దావా వేస్తూ, నోటీసులు పంపించానని అనిత తెలిపారు.
“రోజా మితిమీరి ప్రవర్తిస్తూ, దారుణంగా మాట్లాడుతున్నా, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఎందుకు వారించడం లేదని” ప్రశ్నించిన ఆమె, తాను తప్పు చేసినట్టు నిరూపిస్తే క్షమాపణలు చెప్పడానికి సిద్ధమని, తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రోజా క్షమాపణ చెప్పేందుకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు.
కాగా, ఇటీవల ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో గందరగోళం జరుగుతున్న వేళ, చంద్రబాబుకు అడ్డుగా నిలబడిన అనితపై వ్యక్తిగత దూషణలకు దిగిన రోజా, అనకూడని మాటలు అన్నదని, రాయడానికి వీల్లేని పదాలు వాడిందని వార్తలు ప్రసారమైన సంగతి తెలిసిందే.
ADVERTISEMENT





