ప్రతిపక్ష పార్టీ అంటే ప్రజల తరుపున నిలబడి ప్రజా సమస్యలను ప్రభుత్వం ముందు ఏకరువు పెట్టి, వాటి పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి చేసి ప్రజలకు మద్దతుగా నిలవాలి. కానీ, అందుకు భిన్నంగా ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ప్రజలను అడ్డం పెట్టుకుంటూ, సాక్షాత్తు ముఖ్యమంత్రి పై అసభ్య పదజాలంతో, కార్యకర్తలను రెచ్చగొట్టే ధోరణిలో విమర్శలను చేస్తూ రాష్ట్రంలో అశాంతికి భీజం వేస్తున్నారు.
ఇటీవల ముఖ్యమంత్రిపై జగన్ చేసిన కామెంట్స్ ఎంతటి ధుమారాన్ని లేపాయో అందరికి అవగతమే. అయితే ఆ విమర్శలను మిత్రపక్షాలు కూడా స్వాగతిoచకపోగా, తిరిగి జగన్ వైపే వేలెత్తి చూపడంతో కాస్త వెనక్కి తగ్గిన జగన్, బరిలోకి రోజాను పంపి ఇక ఆ గురుతర బాధ్యతలను మీరు పూర్తి చేయండి అని చెప్పినట్టుగా కనపడుతోందని అనుకుంటున్నారు ‘రోజా అండ్ కో’ పెట్టిన ప్రెస్ మీట్ చుసిన వారంతా!
“జగన్ చెప్పులను చేతికి తీసుకోమని” చెప్తే, రోజా గారు ఒక అడుగు ముందుకు వేసి “చేతికి పేడ నీళ్ళు తీసుకోమని” అంటున్నారు. సమస్యల పరిష్కారానికి ప్రజలంతా చేతికి నిజంగా చెప్పులు, చీపుర్లు, పేడ నీళ్ళు తీసుకుంటే, రాష్ట్రంలో ఏర్పడే పరిస్థితులను అంచనా వేయడం ఎవ్వరికి సాధ్యం కాని పని. ఇలా చేయడం వలన రాష్ట్రంలో ఉన్న సమస్యలు పోకపోగా కొత్తవి పుట్టుకొస్తాయి. బహుశా ఈ పరిస్థితి రావాలనే ప్రతిపక్ష పార్టీ కోరుకొంతుందేమో అనే అనుమానాలు సామాన్య ప్రజలకు కలుగక ముందే వైఎస్సార్సీపీ నేతలు గ్రహిస్తే అది రాష్ట్రానికే మంచిది.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషించిన చంద్రబాబు కూడా ఆనాటి ప్రభుత్వ విధానాలను విమర్శించిన వారే. అయితే ఆ విమర్శలు ముఖ్యమంత్రి స్థాయిని అగౌరవపరిచేలా ఉండేవి కాదు. హుందాతనంతో కూడిన విమర్శలు చేస్తే స్వాగతిస్తారు అని చెప్పడానికి ఒక ఉదాహరణ మాత్రమే. అలా కాకుండా ముఖ్యమంత్రి పదవిని కూడా గౌరవించక ముఖ్యమంత్రిని పిచ్చాసుపత్రికి పంపాలి, ఆయనొక అనకొండ అని రోజమ్మ చేస్తున్న విమర్శలు ఎంతవరకు సమంజసమో ఒక్క సారి పునరాలోచన చేసుకుంటే ఆ పార్టీకే శ్రేయస్కరం.
ప్రభుత్వాన్ని విమర్శించడం వలన ప్రజలకు మంచి జరగాలే తప్ప వారి జీవితాలకు అభద్రతా భావాన్ని కల్పించకూడదు. ఈ విధంగా రాష్ట్రంలో అల్లర్లు జరిగితే ప్రజలలో అధికార పార్టీ మీదే కాదు, దానికి కారణమవుతున్న ప్రతిపక్ష పార్టీ మీద కూడా అంతే వ్యతిరేకత వస్తుంది అనే విషయాన్ని గుర్తించి, హుందాతనంతో కూడిన విమర్శలకు పదును పెడతారని ఆశించడం తప్ప… మన చేతుల్లో ఏంలేదు సుమీ..!





