కాపు ఐక్య వేదిక కార్యక్షేత్రం తూర్పు గోదావరి జిల్లా తుని నుంచి కిర్లంపూడికి మారింది. ఆదివారం మధ్యాహ్నం తునిలోని కొబ్బరి తోటల్లో ప్రారంభమైన కాపు గర్జనకు హాజరైన లక్షలాది మంది కాపులు ఆ వర్గం నేత ముద్రగడ పద్మనాభం పిలుపుతో హింసకు దిగారు. ఈ సందర్భంగా జాతీయ రహదారిపై బైఠాయించిన ముద్రగడ నిన్న రాత్రి 10 గంటల సమయంలో అక్కడి నుంచి లేచారు. తాజాగా ఆయన తూర్పు గోదావరి జిల్లాలోని కిర్లంపూడికి చేరుకున్నారు.
నేటి మధ్యాహ్నం 3 గంటలకు కాపు నేతలతో ముద్రగడ కీలక సమావేశం నిర్వహించనున్నారు. అంతేకాక సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడనున్న ముద్రగడ తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నారు. నేటి సాయంత్రంలోగా కాపులను బీసీల్లో చేరుస్తూ జీవో జారీ చేయాలని ముద్రగడ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసిన విషయం తెలిసిందే. జీవో జారీ కాకపోతే ఆమరణ దీక్షకు దిగుతానని కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో కిర్లంపూడిలో ముద్రగడ చేయనున్న ప్రకటనపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.





