ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడిన వర్తమాన రాజకీయాల పుణ్యమా అంటూ ఒక కులం గురించి చర్చించుకోవాల్సిన దుస్థితి పట్టింది. ఎక్కువ శాతం సామజిక వర్గం గల కాపులు ఎటు వైపుకు మొగ్గు చూపితే అటు వైపుకు అధికారం మల్లుతున్నది చరిత్ర చెబుతున్నఅంశం. దీంతో సహజంగానే ఈ వర్గపు ఓటు బ్యాంకింగ్ ను తమ వైపుకు మలుచుకోవడం కోసం రాజకీయ నాయకులు రకరకాలైన ప్రకటనలు చేస్తుంటారు. ఎన్నికల హామీలలో ఇవన్నీ సర్వసాధారణమే.
అయితే ఉన్నట్లుండి ముద్రగడ పద్మనాభం నేతృత్వంలో జరిగిన ‘కాపు ఐక్యగర్జన’ రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులకు కారణమవ్వడంతో కాపుల వర్గం చర్చనీయాంశమైంది. ఎప్పుడూ పెద్దగా వార్తల్లో నిలవని ఈ వర్గం ఇంత అలజడిని సృష్టించిందా? లేక ఈ సభలో కొందరు అల్లరిమూక చేరి ప్రణాళిక ప్రకారమే ఇంతటి ఆందోళనలకు కారణమయ్యారా? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే, మరికొంత సమయం పడుతుంది. అయితే, ఈ ఘటనతో ముద్రగడ పద్మనాభం కాపుల పరువు తీసారని సోషల్ మీడియా వేదికగా ఔత్సాహికులు వ్యక్తపరుస్తున్న అభిప్రాయాలు.
ఏ ఒక్క వర్గానికో చెందిన వాడిగా ముద్ర వేయించుకుంటే మెగాస్టార్ చిరంజీవిని సైతం కాపులు అంగీకరించని పరిస్థితి. మరి అది తెలిసి కూడా ముద్రగడ చేసిన ప్రయత్నం కేవలం కాపులను ఉద్ధరించడానికేనా? లేక ఇంకేమైనా, ఇంకెవరి కోసమైనా చేసిన ప్రయత్నంగా భావించాలా? ముద్రగడ ఎవరి కోసం చేసినా, చేయకున్నా మొత్తంగా కాపులకు తలఒంపులు చేసే కార్యక్రమమైతే విజయవంతంగా నిర్వహించారని విశ్లేషకులు మండిపడుతున్నారు.





