ఇటీవలే విడుదలై సక్సెస్ సాధించిన ఇస్మార్ట్ శంకర్ సినిమా చాలా మంది కెరీర్లకు మంచి బూస్ట్ ఇచ్చింది. చాలా కాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరో రామ్తో పాటు డైరెక్టర్ పూరి జగన్నాథ్ కెరీర్కు కూడా ఈ సినిమా చాలా ప్లస్ అయ్యింది. అంతేకాదు హీరోయిన్ నభా నటేష్కు ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ కలిసొచ్చినట్టుగానే ఉంది. ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ సరసన డిస్కో రాజా చిత్రంలో నటిస్తున్న ఆమె ఇప్పుడు రెండు మంచి ఆఫర్లు సాధించింది అది కూడా స్టార్ హీరోల సరసనే.
వరుస పరాజయాలతో సతమతం అవుతున్న అఖిల్ అక్కినేని నాలుగో చిత్రంలో ఆమె రెండో హీరోయిన్ గా ఎంపికైందని సమాచారం. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో ఆల్రెడీ పూజా హెగ్డే ను మెయిన్ హీరోయిన్ గా తీసుకున్నారు. మరోవైపు ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ‘ప్రతిరోజూ పండగే’ సినిమాలో నటిస్తున్న సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ మరో సినిమాను లైన్లో పెట్టాడు. సుబ్బు అనే కొత్త దర్శకుడితో కలిసి సినిమా చేసేందుకు ఇటీవలే ఓకె చెప్పాడు.
సీనియర్ నిర్మాత బీవీయస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నభా హీరోయిన్గా నటించనున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఈ మూడు ప్రాజెక్టులు గనుక విజయం సాధిస్తే ఈ ఇస్మార్ట్ భామ కేరీర్ సెట్ అయిపోయినట్టే. డిస్కో రాజా చిత్రం ఇప్పటికే డిసెంబర్ 20న క్రిస్మస్ పండుగ సందర్భంగా విడుదల చెయ్యబోతున్నట్టు ఆ చిత్రబృందం ప్రకటించింది. అఖిల్ సినిమా 2020 సమ్మర్ కు విడుదల అయ్యే అవకాశం ఉంది. సాయి ధరమ్ తేజ్ సినిమా ఈ ఏడాది సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉందట.





